శ్రీవారి భజనల పేరడీ: పవన్ ఆదేశాలతో వైసీపీ ఎమ్మెల్సీపై జనసేన ఫిర్యాదు

Janasena complaint against YSRCP MLC for Srivari bhajan parody
  • శ్రీవారి భజనలను పేరడీ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై ఆరోపణ
  • తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు
  • హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్న జనసేన
  • నెల్లూరులో డీఎస్సీ నిరసన సందర్భంగా ఈ ఘటన జరిగిందని ఆరోపణ
  • ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీటీడీ స్పందించాలని డిమాండ్
నెల్లూరులో డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా చేపట్టిన నిరసనలో శ్రీవారి భజనలు, గోవింద నామాలను పేరడీ చేస్తూ అపహాస్యం చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే అభియోగంతో సోమవారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదును అందజేశారు.

ఈ విషయంపై జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. దేవుడి నామాలను పేరడీలతో కించపరిచేవారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ క్రమంలో జనసేన నేతలు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ రాయల్ ఈ ఫిర్యాదు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, డీఎస్సీ నిరసన దీక్షలో పవిత్రమైన గోవింద నామాలను పరిహసించడం సనాతన ధర్మాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్సీతో పాటు ఇతరులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సైతం తక్షణమే స్పందించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నాయకులు హేమ కుమార్ కిశోర్, మనోజ్, సాయి దేవ్, సాయి, పురుషోత్తం, ఆది తదితరులు పాల్గొన్నారు. మత విశ్వాసాలను కించపరిచే ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించకూడదని, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రస్తుతం వైసీపీ నిరసనలు నిర్వహిస్తోంది.


Advertisement
Chandrasekhar Reddy
Janasena Party
Govinda Namalu Parody
Nellore DSC Protest
Kiran Royal
Hindu Sentiments

More Telugu News