హీరో దర్శన్‌ కేసులో మరో ట్విస్ట్‌.. అప్రూవర్‌ పిటిషన్‌లో సంచలన ఆరోపణలు!

Darshan case twist sensational allegations in approver petition
  • అప్రూవర్‌గా మారేందుకు ముందుకొచ్చిన నిందితుడు ప్రదోష్‌
  • దర్శన్‌ దాడి చేసినట్లు పిటిషన్‌లో ఆరోపణ
  • హత్య తర్వాత మృతదేహం తరలించినట్లు వెల్లడి
  • నిందితులకు నగదు ఇచ్చినట్లు ఆరోపణ
  • మరో ఇద్దరూ అప్రూవర్‌ మారేందుకు కోర్టుకు విన్నపం
  • తనకు ప్రత్యేక భద్రత ఇవ్వాలని ప్రదోష్‌ విజ్ఞప్తి
కన్నడ నటుడు దర్శన్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ప్రదోష్‌ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌లో హత్యకు ముందు, తర్వాత జరిగిన ఘటనలపై సంచలన ఆరోపణలు చేశాడు. రేణుకాస్వామిపై దాడి నుంచి మృతదేహాన్ని తరలించడం వరకు పలు విషయాలను వివరించాడు.

ప్రదోష్‌ పిటిషన్‌ ప్రకారం.. పవిత్ర గౌడకు రేణుకాస్వామి పంపినట్లు చెబుతున్న సందేశాలపై దర్శన్‌ అతడిని ప్రశ్నించాడు. అనంతరం దాడి చేశాడు. ఆ సమయంలో రేణుకాస్వామి తల నుంచి రక్తం వచ్చింది. పవిత్ర గౌడను కూడా అతడిని కొట్టాలని దర్శన్‌ కోరాడు. ఆ తర్వాత రేణుకాస్వామిని లోదుస్తుల్లో ఉంచి ఇతర నిందితులు కర్రలు, నైలాన్‌ తాడుతో కొట్టారు.

దాడి కొనసాగుతున్న సమయంలో తాను పలుమార్లు అడ్డుకున్నానని ప్రదోష్‌ చెప్పాడు. అయినా దాడి ఆగలేదని పేర్కొన్నాడు. చివరకు రేణుకాస్వామి కుప్పకూలినట్లు తెలిపాడు. దర్శన్‌ అతడి ఛాతిపై కాళ్లతో తొక్కినట్లు పిటిషన్‌లో ఆరోపించాడు.

హత్య తర్వాత కూడా విషయం బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రదోష్‌ ఆరోపించాడు. ఘటనను మరో విధంగా చూపించేందుకు నిందితులు చర్చించినట్లు తెలిపాడు. రేణుకాస్వామి మృతదేహాన్ని మరో ప్రాంతానికి తరలించి, హత్య జరిగిన ప్రదేశం వేరే అన్నట్లుగా చూపించాలని ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.

అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమని ప్రదోష్‌ కోర్టుకు తెలిపాడు. హత్యకు సంబంధించిన తనకు తెలిసిన విషయాలన్నింటినీ నిజాయతీగా వెల్లడిస్తానని పేర్కొన్నాడు. అతడి తర్వాత మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారతామని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. తనకు సహనిందితుల నుంచి ముప్పు ఉండొచ్చని చెబుతూ ప్రత్యేక భద్రత కల్పించాలని ప్రదోష్‌ మరో పిటిషన్‌ వేశాడు.

అయితే ఛార్జ్‌షీట్‌లో ప్రదోష్‌ కూడా హత్య, సాక్ష్యాల ధ్వంసం సహా పలు అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అతడు ఘటనాస్థలంలో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ప్రదోష్‌ అప్రూవర్‌ పిటిషన్‌ను ప్రాసిక్యూషన్‌ కూడా షరతులతో సమర్థించింది. ఈ పిటిషన్‌పై బెంగళూరులోని 59వ సెషన్స్‌ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

రేణుకాస్వామి కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన వ్యక్తి. బెంగళూరులోని ఓ ఫార్మా కంపెనీలో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేసేవాడు. 2024 జూన్‌లో అతడు హత్యకు గురయ్యాడు. పవిత్ర గౌడకు సోషల్‌ మీడియాలో అభ్యంతరకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు రావడంతో అతడిని దర్శన్‌ సహా మరికొందరు బెంగళూరుకు రప్పించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఓ షెడ్‌లో అతడిపై దాడి జరిగినట్లు పోలీసులు ఆరోపించారు. తీవ్ర గాయాలతో రేణుకాస్వామి మృతి చెందగా, ఈ కేసులో నటుడు దర్శన్‌, ఆయన సన్నిహితురాలు పవిత్ర గౌడ సహా పలువురిని నిందితులుగా చేర్చారు.
Advertisement
Darshan
Renukaswamy murder case
Pavithra Gowda
Pradosh approver petition
Kannada actor Darshan case
Bengaluru court news

More Telugu News