పట్నా హైకోర్టు సీజేగా తెలుగు తేజం జస్టిస్ కామేశ్వరరావు!

Justice Kameswar Rao appointed as Patna High Court Chief Justice
  • సుప్రీంకోర్టు కొలీజియం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు
  • జస్టిస్ కామేశ్వరరావుది ఏపీలోని కోనసీమ జిల్లా
  • మరో మూడు హైకోర్టులకు కూడా కొత్త సీజేల పేర్ల ప్రతిపాదన
  • త్వరలో రాష్ట్రపతి ఆమోదం, కేంద్రం నుంచి ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావుకు కీలక పదవి లభించనుంది. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు పంపింది.

కొలీజియం సిఫారసుల ప్రకారం.. జస్టిస్ కామేశ్వరరావుతో పాటు, బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర విఠల్‌రావు ఘుగేను కలకత్తా హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టుకు, పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ అశ్వినీకుమార్ మిశ్రాను అదే హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత, కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది.

జస్టిస్ కామేశ్వరరావు 1965లో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జన్మించారు. ఆయన స్వగ్రామం రాజోలు మండలం పొన్నమండ. తండ్రి ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడటంతో, ఆయన విద్యాభ్యాసం, న్యాయవాద వృత్తి అక్కడే కొనసాగింది. 2013లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, 2015లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. గతంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలు అందించారు. తెలుగు వ్యక్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం రావడంపై ఆయన స్వస్థలం కోనసీమ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Justice V Kameswar Rao
Patna High Court Chief Justice
Supreme Court Collegium
High Court CJ Appointments
Justice Valluri Kameswar Rao
Andhra Pradesh Judge

More Telugu News