మోదీతో సుఖ్బీర్ బాదల్ భేటీ.. పొత్తు పునరుద్ధరణ దిశగా బీజేపీ-శిరోమణి అకాలీదళ్ కసరత్తు?
- డీలిమిటేషన్ కు మద్దతు ప్రకటించిన సుఖ్బీర్ సింగ్ బాదల్
- గతంలో సాగు చట్టాల వివాదంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్
- ప్రస్తుతం పంజాబ్లో మారుతున్న రాజకీయ పరిణామాలు
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన మరుసటి రోజే కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు బాదల్ మద్దతు ప్రకటించారు. దీంతో, పంజాబ్లో బీజేపీ - అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు పొడుస్తోందనే చర్చలు ఊపందుకున్నాయి. ప్రధానితో జరిగిన భేటీ సానుకూలంగా జరిగిందని, పంజాబ్ అభివృద్ధి, రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో సాగు చట్టాల వివాదంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్, ప్రస్తుతం పంజాబ్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్లీ కమలం పార్టీతో జతకట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ స్థానాల పునర్విభజనపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు పలకడం కూడా ఈ పొత్తు సంకేతాలలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ పంజాబ్ రాజకీయాల్లో కొత్త మైత్రికి దారితీస్తుందనే చర్చలు జోరందుకున్నాయి.