రేపు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న కేసీఆర్
- అనారోగ్య కారణాలతో ఇటీవల కన్నుమూసిన పెద్ది సుదర్శన్ రెడ్డి
- పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేసీఆర్
- ఇప్పటికే పెద్ది కుటుంబానికి రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కేసీఆర్
పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అత్యంత ఆప్తుడిగా, ముఖ్య అనుచరుడిగా ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కుటుంబాన్ని స్వయంగా పరామర్శించనున్నారు. ఇందుకోసం నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి రేపు ఆయన వెళ్లనున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్టకాలంలో పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందనే భరోసా ఇవ్వనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబంతో పాటు నర్సంపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలిసి కేసీఆర్ ధైర్యం చెప్పనున్నారు. కాగా, ఇప్పటికే పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.