అకాడమీకి రెండోసారి భూమిపూజ.. కారణం చెప్పిన పీవీ సింధు

PV Sindhu explains reason for second Bhoomi Puja of her academy
  • మొదటి కార్యక్రమం హడావుడిగా జరిగిందన్న సింధు
  • చంద్రబాబు సూచనతో ప్రాజెక్టును విస్తరించామన్న బ్యాడ్మింటన్ స్టార్
  • కొత్త ప్రారంభానికి ముఖ్యులను ఆహ్వానించానన్న సింధు
తన బ్యాడ్మింటన్ అకాడమీకి రెండోసారి భూమిపూజ నిర్వహించడంపై వస్తున్న విమర్శలకు స్టార్ షట్లర్ పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన కలల ప్రాజెక్టును సరికొత్తగా పునఃప్రారంభిస్తున్న తరుణంలో, తనకు అత్యంత ఆప్తులైన వారు పక్కన ఉండాలనే ఉద్దేశంతోనే మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరుకావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తొలిసారి నిర్వహించిన భూమిపూజ కేవలం ఏడు గంటల వ్యవధిలో అత్యంత వేగంగా జరిగిందని సింధు తన ట్వీట్‌లో వివరించారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, గ్రీన్‌కో ప్రతినిధులు అనిల్, స్వాతి వంటి శ్రేయోభిలాషులు హాజరుకాలేకపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో ఈ ప్రాజెక్టు పరిధిని మరింతగా విస్తరించినట్లు వెల్లడించారు.

కేవలం బ్యాడ్మింటన్ అకాడమీకే పరిమితం కాకుండా, క్రీడలు, విద్యను మేళవించే ఒక సమగ్ర విద్యా సంస్థగా దీనిని తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు సింధు తెలిపారు. ఈ బృహత్తర ఆశయాన్ని ప్రారంభించే సమయంలో తనకు అండగా నిలిచిన వారందరూ తోడుండాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. 2028 ఒలింపిక్స్‌ లక్ష్యంగా ఇకపై పనులను మరింత వేగవంతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.                                
Advertisement
PV Sindhu
PV Sindhu Badminton Academy
Nara Lokesh
Chandrababu Naidu
Andhra Pradesh Sports
Badminton Education Academy

More Telugu News