సరిహద్దులో చైనా శతఘ్నులను మోహరించిన పాకిస్థాన్.. భారత్ గట్టి వార్నింగ్

Pakistan deploys Chinese Howitzers on border India gives strong warning
  • సరిహద్దులో 250 చైనా తయారీ శతఘ్నులను మోహరించిన పాకిస్థాన్
  • జాతీయ ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేసిన భారత్
  • గతంలో 'ఆపరేషన్ సిందూర్'లో గట్టి బుద్ధి చెప్పామని గుర్తుచేసిన విదేశాంగ శాఖ
భారత సరిహద్దు వెంబడి చైనా తయారీకి చెందిన దాదాపు 250 ఎస్‌హెచ్-15 శతఘ్నులను పాకిస్థాన్ మోహరించినట్లు వెలువడిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి 'అవసరమైన ప్రతి చర్య' తీసుకుంటామని మంగళవారం స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, దేశ రక్షణకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చిచెప్పారు.

చైనాకు చెందిన 'నొరింకో' సంస్థ నుంచి 236 ఎస్‌హెచ్-15 శతఘ్నుల కొనుగోలుకు పాకిస్థాన్ 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నుంచి వీటి సరఫరా ప్రారంభం కాగా, భారత్ సరిహద్దులకు ఎదురుగా ఉన్న గుజ్రాన్‌వాలా, సియాల్‌కోట్, జలాల్‌పూర్ జట్టాన్ సెక్టార్లలో వీటిని మోహరించారు. ముఖ్యంగా షకర్‌గఢ్ బల్జ్ సమీపంలో వీటిని అధికంగా కేంద్రీకరించారు. రాకెట్ సాంకేతికత సాయంతో ఇవి 50 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను ఈ సందర్భంగా ప్రస్తావించిన జైస్వాల్, ఆనాడు పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గుర్తుచేశారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) ఇటీవల నిర్వహించిన స్థానిక ఎన్నికలను ఆయన 'పూర్తి బూటకం'గా అభివర్ణించారు. ప్రజల అసమ్మతిని అణచివేసేందుకు పాకిస్థాన్ బలప్రయోగం చేస్తోందని, జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు 90 మంది పౌరులు మరణించారని ఆరోపించారు. తమ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను తక్షణమే నిర్మూలించాలని ఆయన పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు.
Advertisement
Pakistan
Chinese Howitzers
SH-15 Howitzer
India Pakistan border news
Randhir Jaiswal
MEA India warning

More Telugu News