తల్లి శవాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచి.. కోటి రూపాయల పెన్షన్ తీసుకున్నాడు.. చివ‌రికి!

Christopher Phillips hid mother body in freezer for three years and took one crore pension
  • తల్లి మృతదేహాన్ని మూడేళ్లపాటు ఫ్రీజర్‌లో దాచిపెట్టిన కొడుకు
  • ఆమె పేరుతో వచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలు అక్రమంగా తీసుకున్న వైనం
  • దాదాపు కోటి రూపాయల మేర ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ
  • నిందితుడికి రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధించిన యూకే కోర్టు
  • వైద్యుల అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా వెలుగులోకి వచ్చిన ఘటన
కన్నతల్లి మరణించిన విషయాన్ని దాచిపెట్టి, ఆమె మృతదేహాన్ని దాదాపు మూడేళ్లపాటు ఇంట్లోని ఫ్రీజర్‌లో ఉంచి, ఆమె పేరుతో వచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలను అక్రమంగా పొందిన వ్యక్తికి యూకే కోర్టు రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. ఈ అమానవీయ ఘటన సౌత్ వేల్స్‌లోని పోర్త్‌కాల్‌లో చోటుచేసుకుంది. క్రిస్టోఫర్ ఫిలిప్స్ (60) అనే వ్యక్తి, తన తల్లి సిల్వియా ఫిలిప్స్ మరణం తర్వాత ఆమె పేరుతో సుమారు 78,190 పౌండ్లు (దాదాపు రూ. కోటి) అక్రమంగా పొందినట్లు కోర్టు నిర్ధారించింది.

'ది మెట్రో' కథనం ప్రకారం.. సిల్వియా ఫిలిప్స్ 2023 మార్చిలో మరణించారు. ఆమె మరణాన్ని క్రిస్టోఫర్ అధికారులకు తెలియజేయలేదు. బదులుగా ఇంట్లోని ఓ చెస్ట్ ఫ్రీజర్‌లో ఆమె మృతదేహాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత కూడా ఆమెకు ప్రభుత్వం నుంచి అందే రాష్ట్ర పెన్షన్, సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బును పొందుతూ వ‌చ్చాడు. ఆమె బ్యాంకు ఖాతాలను కూడా యథావిధిగా వాడుకోవడం కొనసాగించాడు.

దాదాపు మూడేళ్ల తర్వాత 2026 ఫిబ్రవరిలో సిల్వియా ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన వైద్యులు, ఆమెను పరిశీలించాలంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు క్రిస్టోఫర్ ఇంటికి వెళ్లి విచారించగా, తన తల్లి లండన్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిందని మొదట అబద్ధం చెప్పాడు. అయితే, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఇంటిని పూర్తిగా తనిఖీ చేయగా, ఫ్రీజర్‌లో ఉన్న మృతదేహం బయటపడింది.

విచారణ సందర్భంగా, క్రిస్టోఫర్ చాలా సంవత్సరాలుగా తన తల్లికి పూర్తిస్థాయి కేర్‌టేకర్‌గా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయానని, ఆమెను వదులుకోవడం ఇష్టం లేక అలా చేశానని నిందితుడు విచారణలో చెప్పినట్లు అతని తరఫు లాయర్ వాదించారు. తల్లి మరణం తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని కూడా కోర్టుకు తెలిపారు.

అయితే, వాదనలు విన్న న్యాయమూర్తి ట్రేసీ లాయిడ్-క్లార్క్.. చట్టబద్ధమైన అంత్యక్రియలను నిరోధించడం, ప్రభుత్వ ప్రయోజనాలను మోసపూరితంగా పొందడం వంటి నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. క్రిస్టోఫర్‌కు రెండేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పోలీసులు పేర్కొన్నారు. 
Advertisement
Christopher Phillips
Sylvia Phillips
UK freezer body case
Pension fraud UK
South Wales crime
UK court sentence

More Telugu News