రేపు విజయవాడలో వైసీపీ ధర్నాకు అనుమతి లేదు: డీసీపీ కృష్ణకాంత్ పటేల్

రేపు విజయవాడలో వైసీపీ ధర్నాకు అనుమతి లేదు: డీసీపీ కృష్ణకాంత్ పటేల్

YSRCP protest in Vijayawada tomorrow no permission says DCP Krishnakanth Patel
  • విజయవాడలో వైసీపీ నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు
  • డీఎస్సీ అక్రమాలపై ఆందోళనలకు పిలుపునిచ్చిన వైసీపీ
  • వినాయక నిమజ్జనం, ట్రాఫిక్ సమస్యల కారణంగా అనుమతి నిరాకరణ
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • నగరంలో ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు
డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ సోమవారం విజయవాడలో చేపట్టతలపెట్టిన నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నగరంలో ప్రస్తుతం వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ధర్నాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వలేమని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఆదివారం స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టేందుకు వైసీపీ అనుమతి కోరింది. అయితే, నగరంలో ఇప్పటికే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు గుర్తుచేశారు. దీనికితోడు వినాయక నిమజ్జన ఊరేగింపుల వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని, బందోబస్తుకు సిబ్బంది కొరత కూడా ఉందని అనుమతి నిరాకరణకు గల కారణాలను వివరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ, నగరంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించి నిరసనలు చేపడితే కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. 
Advertisement
YSRCP
Vijayawada
DCP Krishnakanth Patel
DSC recruitment protest
Ganesh Nimajjanam
Andhra Pradesh Police

More Telugu News