Advertisement

విద్యార్థులను దేశ శత్రువుల్లా చూస్తోంది.. కేంద్రంపై సోనియా తీవ్ర విమర్శలు

Sonia Gandhi condemns police lathi charge on peaceful student protesters in Delhi
  • నీట్‌ నిరసనలపై పోలీసు చర్యలను ఖండించిన సోనియా
  • జులై 20 నాటి ఘటన దేశాన్ని కలచివేసిందని వ్యాఖ్య
  • లాఠీచార్జీ, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంపై ఆగ్రహం
  • విద్యా రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేసిందని ఆరోపణ
  • ప్రభుత్వ పాఠశాలల మూత.. ప్రైవేటు పాఠశాలలు పెరిగాయని విమర్శ
  • ప్రధాన్‌ రాజీనామా చేయకపోవడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు
నీట్‌ పేపర్‌ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం దేశ శత్రువుల్లా చూస్తోందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఆరోపించారు. విద్యార్థుల ధైర్యానికి ప్రభుత్వం జవాబుదారీతనంతో స్పందించాల్సిందిపోయి, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచివేస్తోందని విమర్శించారు.

‘ది హిందూ’లో శుక్రవారం ప్రచురితమైన తన వ్యాసంలో సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నీట్‌ పేపర్‌ లీక్‌, పరీక్షల వ్యవస్థలో లోపాలు, విద్యా సంస్కరణల కోసం విద్యార్థులు న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం వారిని దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులుగా చూస్తోందని విమర్శించారు.

జులై 20న ఢిల్లీలో జరిగిన ఘటనలను ‘అప్రతిష్ఠకరమైన రోజు’ సోనియా అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగించాయని ఆరోపించారు. ఇంటికి వెళ్తున్న విద్యార్థులపై కూడా విచక్షణారహితంగా దాడులు చేశారని, గాయాలతో యువత రక్తమోడిన దృశ్యాలు దేశాన్ని కలచివేశాయని అన్నారు.

2020లో సీఏఏ-ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఆందోళనల సమయంలో విశ్వవిద్యాలయాల్లో జరిగిన పోలీసు చర్యలు, మహిళా రెజ్లర్ల నిరసన సమయంలో జరిగిన ఘటనలను కూడా ఆమె గుర్తు చేశారు. విద్యార్థులపై బలప్రయోగం ఈ ప్రభుత్వానికి కొత్త కాదని వ్యాఖ్యానించారు.

విభేదించే ప్రతి స్వరాన్ని దేశద్రోహంగా ముద్ర వేయడం అలవాటుగా మార్చుకుందని ప్రభుత్వాన్ని సోనియా విమర్శించారు. విద్యార్థుల ఉద్యమాన్ని కూడా అదే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. విమర్శలను కుట్రలుగా చిత్రీకరించకుండా, విద్యార్థులు ఎందుకు రోడ్డెక్కారో ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్రానికి సూచించారు.

విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్లిందని ఆమె ఆరోపించారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల విద్యకు కేటాయించే బడ్జెట్‌ వాటా 50 శాతం, ఉన్నత విద్యకు 33 శాతం తగ్గిందన్నారు. ఈ కాలంలో దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, 43 వేల ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. దీంతో నాణ్యమైన ప్రభుత్వ విద్య సామాన్యులకు అందకుండా పోయిందని అన్నారు.

జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను బలోపేతం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సులను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పట్టించుకోలేదని సోనియా విమర్శించారు. పేపర్‌ లీక్‌ల వంటి తీవ్రమైన వైఫల్యాలు జరిగినా ఆయన రాజీనామా చేయకపోవడం ప్రజల్లో మరింత ఆగ్రహం పెంచిందన్నారు.

విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిలవడం దేశ ప్రజల నైతిక, రాజకీయ, రాజ్యాంగబద్ధ బాధ్యత అని సోనియా గాంధీ పేర్కొన్నారు. వారి భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.
Advertisement
Sonia Gandhi
NEET paper leak protest
Central Government education policy
Dharmendra Pradhan resignation demand
NTA exam reforms
Delhi student lathi charge

More Telugu News