అసెంబ్లీలో నీతులు చెప్పిన తమ్మినేని.. ఫేక్ డెత్ సర్టిఫికెట్తో భూ అక్రమాలకు పాల్పడ్డారు: కూన రవికుమార్
- తమ్మినేని రూ. 4 కోట్ల విలువైన భూములు కొట్టేశారని కూన మండిపాటు
- బతికున్న వ్యక్తి చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించారని విమర్శ
- వైసీపీ నేతలు నోరు విప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారామ్పై ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పుడు ఎన్నో నీతులు చెప్పిన తమ్మినేని సీతారామ్... బతికున్న మనిషి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి రూ. 4 కోట్ల విలువైన భూములను కొట్టేశారని మండిపడ్డారు. ఈ భారీ భూ అక్రమ కొనుగోలు వ్యవహారంలో ప్రధాన సూత్రాధారి తమ్మినేని సీతారామ్ అయితే, దానికి పాత్రధారి ఆయన కుమారుడేనని ఆరోపించారు. భూములు కావాలనుకుంటే చట్టబద్ధంగా కొనుగోలు చేయాలి తప్ప, ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించడం ఏంటని ఆయన నిలదీశారు.
ఇదే సమయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపైనా కూన రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీదిరి అప్పలరాజు తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే, ఆ కేసును పక్కదారి పట్టిస్తూ వేరొక అమాయకుడిని ఇరికించేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇలాంటి దారుణమైన నేరాలు, అక్రమాలపై వైసీపీ నాయకులు నోరు విప్పకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.