సరికొత్త బిజినెస్ ప్రారంభించిన నటి సాక్షి అగర్వాల్!
- 'ఓకూ' పేరుతో న్యూట్రిషన్ కంపెనీని ప్రారంభించిన సాక్షి అగర్వాల్
- నాణ్యమైన పోషకాహార ఉత్పత్తులను అందించడమే లక్ష్యమని వెల్లడి
- తన కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం గర్వంగా ఉందన్న సాక్షి
దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాక్షి అగర్వాల్, ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతూ తన ఐదేళ్ల కలను నిజం చేసుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఓకూ’ పేరుతో ఒక ప్రీమియం పెర్ఫార్మెన్స్ న్యూట్రిషన్ కంపెనీని ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన సాక్షి, ఈ బ్రాండ్ రూపుదిద్దుకోవడానికి తాను గత ఐదేళ్లుగా నిరంతరం పరిశోధనలు చేస్తూ, ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అత్యుత్తమ నాణ్యత కలిగిన పోషకాహార ఉత్పత్తులను అందించడమే తన ప్రధాన ధ్యేయమని ఆమె తెలిపారు. మార్కెట్లో చాలా న్యూట్రిషన్ బ్రాండ్లకు సినీ ప్రముఖులు కేవలం అంబాసిడర్లుగా మాత్రమే పరిమితమవుతారని, కానీ తాను శ్రమించి స్థాపించిన ఈ సంస్థకు తానే స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. వరుస షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వివరించారు.
మోడల్గా కెరీర్ ప్రారంభించి, తమిళంలో ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’, ‘సిండ్రెల్లా’, ‘టెడ్డి’, ‘అరణ్మనై 3’ వంటి హిట్ సినిమాల్లో నటించి, ‘బిగ్బాస్ తమిళ్’ ద్వారా విశేష ప్రజాదరణ పొందిన సాక్షి, ఇప్పుడు బిజినెస్ ఉమెన్గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. నటిగా అలరిస్తూనే వ్యాపారవేత్తగా కూడా విజయం సాధించాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.