విద్యార్థులపై లాఠీచార్జ్... స్పందించిన రాహుల్ గాంధీ

Lathi charge on students Rahul Gandhi responds
  • పరీక్షల్లో అక్రమాలపై ఢిల్లీలో విద్యార్థుల భారీ నిరసన
  • పార్లమెంట్ వైపు వెళుతున్న ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్
  • విద్యార్థులపై దాడి అప్రజాస్వామికమని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నిరసనకారుల డిమాండ్
పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అప్రజాస్వామికమని, భారతీయ సంప్రదాయానికి విరుద్ధమని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు ఢిల్లీ వేదికగా నిరసన చేపట్టారు. నీట్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా చోటుచేసుకుంటున్న పేపర్ లీకేజీలు, ఇతర అక్రమాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటతో ఉద్రిక్తత నెలకొనగా, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. "ఢిల్లీ వీధుల్లో నిరసన తెలుపుతున్న వారు నేరస్థులు కాదు, తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు. వారిపై బలప్రయోగం చేయడం తగదు" అని ఆయన హితవు పలికారు. దేశంలో 152 పేపర్ లీకేజీల వల్ల సుమారు 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నా, ప్రభుత్వం మాత్రం బాధ్యులను కాపాడటానికే ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
Advertisement
Rahul Gandhi
Student protest Delhi
NEET paper leak
Dharmendra Pradhan resignation
Police lathi charge

More Telugu News