పవన్‌కు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇప్పుడే జనాల్లోకి రాకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పాను: సీఎం చంద్రబాబు

Pawan Kalyan has many fans so I advised him to rest says CM Chandrababu Naidu
  • పిచ్చుకలంక గ్రామంలో రైతులతో ముఖాముఖి
  • పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యం దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని సూచించానన్న చంద్రబాబు
  • పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ
  • రూ.152 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి 117 కొత్త గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభం
  • గత ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించిందని, గొడ్డలి పార్టీతోనే సమస్య అని విమర్శ
  • త్వరలోనే అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకొస్తామని వెల్లడి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అభిమానులు చాలా ఎక్కువని, ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతానికి జనంలోకి రాకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని తాను సూచించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పిచ్చుకలంక గ్రామంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

"పవన్ కల్యాణ్‌కు భుజం నొప్పితో ఆపరేషన్ జరిగింది. ఆయన్ను పరామర్శించడానికి నేను ముంబై వెళ్లాను. ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. అయినా ప్రజల్లోకి వస్తానని డిప్యూటీ సీఎం అంటున్నారు. అభిమానుల తాకిడి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యం బాగుంటేనే ప్రజలకు మరింత బాగా సేవ చేయగలరు. అందుకే పూర్తి ఆరోగ్యవంతుడయ్యే వరకు విశ్రాంతి తీసుకోమని చెప్పాను" అని చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ, తాను, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.

పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం

గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం 72% పనులు పూర్తి చేస్తే, గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం 2% పనులు మాత్రమే చేసి డయాఫ్రమ్ వాల్‌ను గోదావరి పాలు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ప్రాజెక్టును 89 శాతం పూర్తి చేశామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి న్యాయం చేస్తామన్నారు.

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త కళ

పర్యటనలో భాగంగా తొలుత ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.152 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి డెల్టాకు కాటన్ దొర చేసిన సేవలను స్మరించుకున్నారు. బ్యారేజీ గేట్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతింటే గత ప్రభుత్వం కనీసం గ్రీజు కూడా పెట్టలేదని, తమ ప్రభుత్వం 9 నెలల్లో కొత్త గేట్లను అమరుస్తుందని తెలిపారు. త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్టును కూడా తీసుకొస్తామని ప్రకటించారు.

‘గొడ్డలి పార్టీ’తోనే సమస్య

గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహించి యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. "నాకు రౌడీలు, బ్లేడ్ బ్యాచ్‌లతో సమస్య లేదు. కానీ ఇప్పుడు గొడ్డలి పార్టీతోనే సమస్య వస్తోంది. వారు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వారికి స్టూడియోలు పెట్టిస్తూ ఫైనాన్స్ చేస్తున్నారు" అని మండిపడ్డారు. గంజాయి మత్తులో ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.

రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ నిధులు జమ చేస్తామని, ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు సాయం అందించామని గుర్తుచేశారు. కోనసీమకు రైల్వే లైన్ తీసుకురావడంతో పాటు, పిచ్చుకలంక, బొజ్జర్లంక ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ ఇచ్చి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.


Advertisement
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Polavaram Project Update
Pawan Kalyan Health News
Konaseema District Development

More Telugu News