ఖమేనీ అంత్యక్రియల్లో మాస్కుతో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసింది!

Mohammad Javad Khamenei identified as the masked person at Ali Khamenei funeral
  • ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన ముసుగు వ్యక్తి మిస్టరీ వీడింది
  • ఆ వ్యక్తి ఖమేనీ కుమారుడు మొజ్తబా కాదు, మనవడు మహ్మద్ జావాద్ అని గుర్తింపు
  • వైమానిక దాడిలో ముఖానికి తీవ్ర గాయాలు కావడంతోనే మాస్క్ ధరించినట్లు వెల్లడి
  • అదే దాడిలో గాయపడిన కుమారుడు మొజ్తబా వారసుడిగా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం
  • ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత మషద్‌లో అంత్యక్రియలు
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సమయంలో ఓ ముసుగు ధరించిన వ్యక్తిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆ వ్యక్తి ఖొమైనీ కుమారుడు మొజ్తబా కాదని, ఆయన పెద్ద మనవడు మహ్మద్ జావాద్ ఖమేనీ అని ఇరాన్ మీడియా గుర్తించింది. గురువారం మషద్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ముందు వరుసలో ఈయన కనిపించడంతో, వారసత్వ బాధ్యతలు చేపట్టిన మొజ్తబానే అయి ఉంటారని అంతా భావించారు.

ఫిబ్రవరి 28న ఖమేనీ నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఇదే దాడిలో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. ఖమేనీ పెద్ద కుమారుడు ముస్తఫా కొడుకైన మహ్మద్ జావాద్‌కు ఈ దాడిలో ముఖంపై తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఈ కారణంగానే ఆయన అంత్యక్రియల్లో మాస్క్, టోపీ ధరించి కనిపించినట్లు ఇరాన్ మీడియా సంస్థలు రోక్నా, ఇరాన్ ఇంటర్నేషనల్ తమ కథనాల్లో పేర్కొన్నాయి.

ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా ఇదే దాడిలో గాయపడినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ముఖం, కాళ్లు, చేతికి గాయాలైనట్లు గతంలో అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. దాడి జరిగినప్పటి నుంచి మొజ్తబా బయట కనిపించడం లేదు. సైనిక, మత పెద్దలతో కేవలం లిఖితపూర్వక సందేశాల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఖమేనీ మరణించిన నాలుగు నెలలకు పైగా ఆలస్యంగా ఆయన స్వస్థలమైన మషద్‌లోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఖమేనీ కుటుంబ సభ్యుల గాయాలపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
Mohammad Javad Khamenei
Ali Khamenei funeral
Mojtaba Khamenei
Iran Supreme Leader
Mashhad Iran
Iran Israel airstrike

More Telugu News