జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says development is with people and future with population
  • నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
  • విజయవాడలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు
  • జనాభా నియంత్రణ నుంచి సంరక్షణ వైపు ప్రభుత్వ విధానం
  • ‘పిల్లలే సంపద’ పేరుతో కొత్త కార్యక్రమానికి నాంది
  • యువత నైపుణ్యం, వృద్ధుల అనుభవం దేశానికి ఆస్తి అన్న సీఎం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మార్పుపై సంకేతం
  • మైక్రో కుటుంబాల కన్నా ఉమ్మడి కుటుంబాలే మేలని వ్యాఖ్య
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జనాభా విధానంపై ఒక సంచలనాత్మక, కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు అనుసరించిన 'జనాభా నియంత్రణ' విధానానికి స్వస్తి పలికి, 'జనాభా సంరక్షణ' అనే కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. "జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తు" అనే నినాదాన్ని ఇస్తూ, భవిష్యత్తులో 'పిల్లలే సంపద' అనే మాటను నిజం చేసి చూపిస్తామని ఆయన ప్రకటించారు. విజయవాడలో నేడు (జులై 11) జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

గతంలో ప్రభుత్వాలు జనాభా నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాయని, అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించే నిబంధనలు కూడా తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆ విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. 

"దేశమంటే మట్టి కాదోయ్-దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటల్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడుతుంది. గతంలో మహిళల్లో అక్షరాస్యత పెరిగితే జనాభా నియంత్రణ సాధ్యమని భావించాం. 'ఒక్కరు ముద్దు, ఇద్దరితో సరి' వంటి ప్రచారాలు చేశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఫెర్టిలిటీ రేటు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో జనాభా తగ్గిపోతోందని, భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. "అభివృద్ధి సంతులనం కావాలంటే జనాభా నిర్వహణ చాలా కీలకం. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 89 శాతం మందికి రెండో సంతానం లేదు. విశాఖ వంటి జిల్లాల్లో ఫెర్టిలిటీ రేటు చాలా తక్కువగా ఉంది. విస్తీర్ణంలో ఏపీ 7వ స్థానంలో ఉన్నా, జనసాంద్రతలో దిగువన ఉన్నాం. పిల్లలే మన రాష్ట్ర సంపద. వారితోనే ఆర్థిక ప్రగతి" అని ఆయన అన్నారు.

చిన్న కుటుంబాల భావన పెరిగిపోవడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. "మైక్రో ఫ్యామిలీల గురించి యువత ఆలోచించడం ప్రమాదకరం. సంతానం వద్దనుకునే దంపతులు పెరగటం దురదృష్టకరం. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ప్రపంచానికి ఆదర్శం. పిల్లలే సంపద- ఉమ్మడి కుటుంబమే శ్రీరామ రక్ష" అని ఆయన అన్నారు. పిల్లలను పెంచడం కేవలం మహిళల బాధ్యతే కాదని, అదొక ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కాన్పుల్లో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గాలని సూచించారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో పోక్సో నిందితుడు ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వ్యసనంగా మారి మానసిక సమస్యలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీకి ఆధ్యాత్మికతను జోడించడం ద్వారా యువత ప్రపంచాన్ని జయించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

యువత నైపుణ్యం, వృద్ధుల అనుభవం సమాజానికి రెండు కళ్ల వంటివని, వారిని ఆస్తిగా మార్చాలని సీఎం అన్నారు. త్వరలో వృద్ధుల కోసం 'క్షేమం' అనే కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. 'తల్లికి వందనం' ద్వారా విద్యార్థులకు, 'సంజీవని' ద్వారా ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తోందన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్న తన సంకల్పానికి, 2040 నాటికే స్వర్ణాంధ్ర సాధనకు తగినంత మానవ వనరులు అత్యవసరమని ఆయన పునరుద్ఘాటించారు. అనంతరం 'పాపులేషన్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్' డాక్యుమెంటేషన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Population Policy
World Population Day 2024
South India Fertility Rate
Population Management Framework
Human Resources Development

More Telugu News