ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నాడు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Jagan Over Property Dispute With Mother While Worshipping Father Grave For Votes
  • బనగానపల్లెలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ 
  • కుల, మత, ప్రాంతాలతో సమాజాన్ని విడగొట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని చంద్రబాబు విమర్శ
  • మత విద్వేషాలు రెచ్చగొడితే కూటమి ప్రభుత్వం సహించదని హెచ్చరిక
  • తీవ్రవాదాన్ని సమర్థించే వారికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపణ
  • తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి సమాజానికి అవసరమా అని పరోక్ష విమర్శలు
"ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, కళ్లెదుట బ్రతికున్న కన్నతల్లికి మాత్రం ఆస్తిలో వాటా ఇవ్వకుండా క్షోభ పెడుతున్న వ్యక్తి మనకెందుకు?" అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కన్నతల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు ఏం సేవ చేస్తారని ఆయన ప్రశ్నించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

గత ప్రభుత్వ పెద్దల తీరును ఎండగడుతూ, "తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి అపచారం చేశారు. నేను మాత్రం చర్చికి, మసీదుకు వెళ్లినా అక్కడి ఆచారాలను గౌరవిస్తాను. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన వాడే అని తెలియగానే తోక ముడిచారు. బతికున్న తల్లికి ఆస్తి ఇవ్వకుండా క్షోభ పెడుతూ, ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తున్నారు. తల్లికి గౌరవం ఇవ్వని ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి అవసరమా?" అని ప్రజలను ప్రశ్నించారు.

"కుట్రలు, కుతంత్రాలతో కులం, మతం, ప్రాంతాల పేరుతో సమాజాన్ని విడదీసేందుకు 'గొడ్డలి పార్టీ' ప్రయత్నిస్తోంది. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తూ, రౌడీయిజంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది" అని ఆయన ఆరోపించారు.

గత పాలనలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనేక ఘటనలు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు. "అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ, రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం వంటి ఘటనల్లో గత పాలకులు నిందితులపై కనీస చర్యలు తీసుకోలేదు. చివరికి తిరుపతి వెంకన్న ప్రసాదాన్ని సైతం కల్తీ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారు. మేం ఇలాంటి వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. రెండు రోజుల క్రితం ఆదోని శివాలయంలో దీపంతో సిగరెట్ వెలిగించిన దుర్మార్గుడిని వెంటనే అరెస్ట్ చేశాం. మత విద్వేషాలు రగిలించే చర్యలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు" అని హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "'రావణ్' అనే వ్యక్తి హిందూ పురాణాలను, శ్రీరాముడిని, సీతాదేవిని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. తీవ్రవాదాన్ని, పాకిస్థాన్‌ను సమర్థించే ఇలాంటి వారికి 'గొడ్డలి పార్టీ' ఆర్థిక సహాయం అందించడం ఎంతటి బరితెగింపు? 'హే రామ్' అంటూనే రావణుడిని ప్రోత్సహించే వారిని ఏమనాలో అర్థం కావడం లేదు. కాలజ్ఞానం రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన వింతలు, విచిత్రాలు ఇప్పుడు చూస్తున్నాం" అని అన్నారు.

సభ అనంతరం ముఖ్యమంత్రి వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వెదురుతో చేసిన ఆభరణాలను ఆసక్తిగా పరిశీలించారు. డ్వాక్రా, మెప్మా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను 'స్వయం బ్రాండ్' పేరుతో మార్కెటింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ బైరెడ్డి శబరి, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Banaganapalle Public Meeting
Andhra Pradesh Politics
Mee Bhoomi Mee Hakku
YSRCP Property Dispute

More Telugu News