హిందూ మనోభావాలు ముఖ్యం కాదా?: జగన్ పై ఆనం విమర్శలు
- రావణ్కు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ ఆనం మండిపాటు
- కోట్లాది మంది హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం కాదా? అని ప్రశ్న
- ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రావణ్కు వైసీపీ నాయకులు మద్దతు తెలపుతున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో మాట్లాడిన ఆయన, "కోట్లాది మంది హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం కాదా? మత విద్వేషాలు రెచ్చగొడుతూ, హిందూమతాన్ని అవమానించిన రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దా?" అని వైసీపీ నేతలను నిలదీశారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం, సమాజంలో విచ్ఛిన్నానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి విద్వేషాలు రెచ్చగొట్టడానికి రావణ్కు గానీ, మాజీ సీఎం జగన్ కు గానీ ఎవరు అధికారమిచ్చారని ఆనం ప్రశ్నించారు. ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని.. నోటికొచ్చినట్లు వాగితే కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు.