కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల కేసీఆర్ విచారం

KCR expresses grief over Kommidi Narasimha Reddy death
  • రాజకీయాల్లో నీతి, నిజాయతీకి నర్సింహారెడ్డి నిదర్శనంగా నిలిచారన్న కేసీఆర్
  • తన వందలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టారని కితాబు
  • తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వ్యాఖ్య

తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో అత్యంత నిరాడంబరతకు, నీతి, నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన ఒక గొప్ప ప్రజల మనిషిని మనం కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవలో నర్సింహారెడ్డి చేసిన అపారమైన కృషిని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు.


భూదానోద్యమ సమయంలో తన సొంత వందలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి నర్సింహారెడ్డి ఆదర్శంగా నిలిచారని కేసీఆర్ కొనియాడారు. 1969లో సాగిన తొలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా... మూసీ నది పరిరక్షణ కోసం, తెలంగాణ ప్రాంతానికి గోదావరి నదీ జలాల సాధన కోసం ఆయన చివరి శ్వాస వరకు నిరంతరం కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. నర్సింహారెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోవడం తీరని లోటు అని అన్నారు. ఆయన మరణంతో శోకసముద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement
Kommidi Narasimha Reddy
KCR
Bhongir MLA
Telangana Movement
BRS Party
Telangana Politics

More Telugu News