‘సీఎం విజయ్‌ పర్యటనలను కూడా మేమే నియంత్రించాలా?’.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court angry with DMK over petition to control CM Vijay visits
  • సీఎం విజయ్‌ కరూర్‌ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీఎంకే పిటిషన్‌
  • సీఎం పర్యటనలపై ఆంక్షలు విధించాలని విన్నపం
  • సాక్షులపై సీఎం ప్రభావం చూపుతారని డీఎంకే వాదన
  • రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలపై ఎలా ఆదేశాలిస్తామని కోర్టు ప్రశ్న
  • కరూర్‌ తొక్కిసలాట కేసు నేపథ్యంలో పిటిషన్‌
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకేపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి విజయ్‌ పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టును వేదికగా మార్చొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో డీఎంకే వెనక్కి తగ్గి తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

కరూర్‌ తొక్కిసలాట కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి విజయ్‌ జులై 10న అక్కడ పర్యటించనున్నారని డీఎంకే కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మృతుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు, ఆర్థిక సాయం అందించే కార్యక్రమం దర్యాప్తులో ఉన్న సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించింది. అంతేకాదు టీవీకే నేత ఆదవ్‌ అర్జున చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రసంగాలు, పర్యటనలపై ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ముఖ్యమంత్రి ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టే చెప్పాలా? ఆయన ఈ కేసులో నిందితుడు కాదు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుపైనా ఆంక్షలు కోరుతున్నారా? రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలపై ఈ కోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుంది?’’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో డీఎంకే తన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది.

గతేడాది సెప్టెంబరులో కరూర్‌లో విజయ్‌ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తొక్కిసలాటకు టీవీకే కార్యకర్తల నిర్లక్ష్యమే కారణమని డీఎంకే ఆరోపిస్తుండగా, ఇదంతా డీఎంకే రాజకీయ కుట్రేనని విజయ్‌, టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.
Advertisement
Vijay
DMK
Supreme Court
Karur stampede
TVK
CBI investigation

More Telugu News