కొరియాలో మంత్రి లోకేశ్‌.. షూఆల్స్ ఛైర్మన్‌తో కీలక భేటీ

Nara Lokesh in South Korea Key meeting with Shoalls Chairman
  • దక్షిణ కొరియాలో షూఆల్స్ ఛైర్మన్‌తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ
  • రూ.300 కోట్ల యూనిట్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
  • ఏపీలో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
  • ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న షూఆల్స్ ఛైర్మన్
  • షోలమ్ గ్రూప్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం
  • శ్రీసిటీలో రూ.338 కోట్ల పెట్టుబడిపై కంపెనీ ప్రతినిధులతో చర్చలు
దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రఖ్యాత ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. సియోల్‌లో ఆ సంస్థ ఛైర్మన్ & సీఈవో లీ చియాంగ్-గెన్‌తో సమావేశమైన లోకేశ్‌, రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు.

గతంలో కుదిరిన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం రూ.300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి గుర్తుచేశారు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆర్ & డీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని లోకేశ్‌ ప్రతిపాదించారు. అలాగే ఏపీని షూఆల్స్ ఉత్పత్తులకు రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా మార్చాలని ఆయన కోరారు.

మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్ప్షన్ వంటి అధునాతన టెక్నాలజీతో మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో ప్రత్యేకత సాధించిందని వివరించారు. ప్రస్తుతం సియోల్ నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏఐ ఆధారిత స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

శ్రీసిటీలో ప్లాంట్ వేగవంతం చేయండి.. షోలమ్ గ్రూప్‌కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి 
ఏపీలోని శ్రీసిటీలో రూ.338 కోట్ల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ సంస్థకు లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. యూనిట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని ఆయన కోరారు. తిరుపతిలో సీఎస్ఓటీ (టీసీఎల్) సంస్థకు డిస్‌ప్లే అసెంబ్లీ యూనిట్ ఉన్నందున, శ్రీసిటీలో కూడా ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఇతర డిస్‌ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీని చేపట్టి కార్యకలాపాలు విస్తరించాలని షోలమ్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జీగాబ్ హా మాట్లాడుతూ.. తమ అనుబంధ సంస్థ షోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇప్పటికే నోయిడాలో ఒక తయారీ కేంద్రం ఉందని, ఇప్పుడు శ్రీసిటీలో కొత్త ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు. తమ సంస్థకు 16 దేశాల్లో కార్యకలాపాలు ఉన్నాయని, అంతర్జాతీయంగా  ఈఎస్ఎల్‌ రంగంలో అగ్రగామిగా ఉన్నామని వివరించారు. మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి మేరకు శ్రీసిటీ యూనిట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Nara Lokesh
South Korea Visit
Shoalls Footwear AP
Solum Group Sri City
Andhra Pradesh Investments
Seoul Business Meetings

More Telugu News