రాణించిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 191
- ఇంగ్లండ్తో రెండో టీ20లో భారత్ భారీ స్కోరు
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసిన టీమిండియా
- అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో ఔటైన ఇషాన్ కిషన్ (49)
- దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ (43), శ్రేయస్ అయ్యర్ (37)
- ఇంగ్లండ్ బౌలర్లలో మూడు వికెట్లు తీసిన శామ్ కరన్
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (24 బంతుల్లో 43) పవర్ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (22 బంతుల్లో 37) కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, ఇషాన్ కిషన్ ఒక్క పరుగు తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకోవడం అభిమానులను నిరాశపరిచింది.
మధ్యలో శివమ్ దూబే (5) విఫలమైనప్పటికీ, చివర్లో తిలక్ వర్మ (11 బంతుల్లో 24 నాటౌట్) రెండు సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత స్కోరు 190 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి భారత్ జోరుకు కొంత కళ్లెం వేశాడు. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యవంశీ స్కోరులో రెండు భారీ సిక్సులున్నాయి. వాటిలో ఆర్చర్ బౌలింగ్ లో లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది. అయితే, పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయిన సూర్యవంశీ స్టంపౌట్ అయ్యాడు.