టాప్ 5 ఐటీ దిగ్గజాలకు సమానంగా.. ఒక్క రిలయన్స్ మార్కెట్ విలువ!
- ఐదు టాప్ ఐటీ కంపెనీల ఉమ్మడి విలువకు చేరువైన రిలయన్స్
- రూ.18 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ మార్కెట్ క్యాప్
- ఏఐ భయాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో కుదేలైన ఐటీ రంగం
- ఈ ఏడాది రిలయన్స్ షేర్లు కూడా 17 శాతం మేర పతనం
- టాప్-5 ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.18.12 లక్షల కోట్లు
శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.18 లక్షల కోట్లుగా నమోదైంది. అదే సమయంలో, దేశంలోని టాప్-5 ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.18.12 లక్షల కోట్లుగా ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు టీసీఎస్ ఒక్కటే రిలయన్స్ కంటే ఎక్కువ మార్కెట్ విలువను కలిగి ఉండేది, కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
2026లో ఐటీ స్టాక్స్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలు, అంతర్జాతీయంగా టెక్నాలజీ వ్యయం తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో ఈ కంపెనీల షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 36 శాతం వరకు పతనమయ్యాయి.
అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఒడిదొడుకులకు అతీతంగా ఏమీ లేదు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లోని మార్పులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావంతో ఈ ఏడాది రిలయన్స్ షేరు విలువ సుమారు 17 శాతం మేర క్షీణించింది. గత నెలలో 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.1,253.20కి పడిపోయిన షేరు ధర, ప్రస్తుతం రూ.1,304 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు, రిలయన్స్ తన వ్యాపార వైవిధ్యీకరణను మరింత వేగవంతం చేస్తోంది. ఇటీవలి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించినట్లుగా, అప్పుల చెల్లింపుల కోసం రూ.35,000-40,000 కోట్ల భారీ లక్ష్యంతో జియో ప్లాట్ఫామ్స్ ఐపీవోకు రంగం సిద్ధం చేస్తోంది.