రామ మందిర విరాళాల చోరీ కేసు.. రోజుకు రూ.8 లక్షలు మాయం?
- విరాళాల లెక్కల్లో భారీ తేడా
- ఎస్బీఐ సిబ్బంది పాత్రపై దర్యాప్తు
- ఇప్పటికే ఎనిమిది మంది నిందితుల అరెస్టు
- ఆడిట్ నివేదికల పునఃపరిశీలనకు అవకాశం
- ట్రస్ట్ మాజీ పదాధికారులపై విచారణ
- ఆస్తులు, ఆదాయ వనరులపై ఆరా
దర్యాప్తు ప్రకారం.. కుంభకోణం బయటపడకముందు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో రోజుకు రూ.16-18 లక్షల వరకు నగదు జమయ్యేది. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అదే మొత్తం రూ.24-26 లక్షలకు పెరిగినట్లు బ్యాంకు అధికారులు సిట్కు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని బట్టి రోజూ భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఆలయ హుండీల్లోని నగదు లెక్కింపు బాధ్యతను ఎస్బీఐ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీ సేవలు తీసుకుంది. ఈ ప్రక్రియలో ఎస్బీఐ సిబ్బంది పాత్రపైనా సిట్ దృష్టి సారించింది. ఒప్పంద నిబంధనలు ఎందుకు పాటించలేదని, నగదు లెక్కింపులో ప్రైవేట్ సిబ్బందికి కీలక బాధ్యతలు ఎలా అప్పగించారనే అంశాలపై బ్యాంకు అధికారులను ప్రశ్నించింది.
దర్యాప్తులో భాగంగా రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, ప్రధాన నిందితుడు సుభాష్ శ్రీవాస్తవ సహా ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. హుండీల్లోని నగదును బయటకు తీసుకురావడం, లెక్కింపునకు పంపించడం, అనంతరం బ్యాంకుకు అప్పగించడం అతని బాధ్యతగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’తోనూ మనీలాండరింగ్ కోణంలో విచారణ జరిపించాలని అయోధ్య పోలీసులు నిర్ణయించారు. డబ్బు ఎక్కడికి వెళ్లిందనే అంశంపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
మరోవైపు ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీలు అనిల్ మిశ్రా, గోపాల్రావులను సిట్ రెండోసారి విచారించింది. వారి ఆస్తులు, ఆదాయ వనరులు, ఆలయ నిర్మాణం, భూకొనుగోళ్లలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపైనా ఆరా తీసింది. అవసరమైతే ట్రస్ట్ ఆడిట్ నివేదికలను మరోసారి పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.