హృతిక్ రోషన్ విడాకులు.. రూ.400 కోట్ల భరణం: ఎట్టకేలకు నిజాన్ని బయటపెట్టిన సుజానే సోదరి!
- రూ.400 కోట్ల భరణం అబద్ధమన్న ఫరా ఖాన్
- హృతిక్ నుంచి పైసా కూడా తీసుకోలేదని స్పష్టీకరణ
- మాజీ అత్తమామలతో అద్భుతమైన బంధం ఉందని వెల్లడి
- 2014లోనే ముగిసిన హృతిక్-సుజానే విడాకులు
"ఆన్లైన్లో రూ. 400 కోట్లు చెల్లించారని, దానివల్ల సుజానే ధనవంతురాలైందని ప్రజలు మాట్లాడటం చూస్తుంటే నా మనసుకు చాలా బాధేస్తుంది. అది పచ్చి అబద్ధం. నా ప్రియమైన సోదరి భరణంగా ఏమీ తీసుకోలేదు" అని ఫరా ఖాన్ అలీ స్పష్టం చేశారు. భౌతికపరమైన వస్తువుల కంటే బంధాలే ముఖ్యమని తమ తల్లి తమకు నేర్పిందని, అందుకే సుజానేకు ఆమె మాజీ భర్త హృతిక్తో మాత్రమే కాకుండా, మాజీ అత్తమామలైన పింకీ, రాకేష్ రోషన్లతో కూడా ఇప్పటికీ అద్భుతమైన అనుబంధం ఉందని ఆమె పేర్కొన్నారు. సుజానే చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిందని, ఆమె 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు ఆశించే వ్యక్తి) కాదని, ఎంతో హుందాగా ప్రవర్తించిందని సోదరి అండగా నిలిచారు.
ఈ అబద్ధపు ప్రచారాలను ఖండించాల్సిందిగా తాను సుజానేకు ఎన్నోసార్లు చెప్పానని, అయితే సుజానే మాత్రం.. "నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం ఫరా. నా జీవితంలో విలువను జోడించని వ్యక్తుల అభిప్రాయాలు నాకు ముఖ్యం కాదు" అని సమాధానమిచ్చిందని ఫరా గుర్తుచేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులైన హృతిక్, సుజానేలు డిసెంబర్ 2000లో వివాహం చేసుకోగా, వీరికి ఇద్దరు కుమారులు (హృహాన్, హృదాన్) ఉన్నారు. వీరిద్దరూ 2013లో విడిపోయి, 2014లో అధికారికంగా విడాకులు తీసుకున్నప్పటికీ, పిల్లల కోసం ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు.