ఢిల్లీలో దారుణం: భార్య మొబైల్ ఫోన్ చెక్ చేసిన భర్త.. అతడి ప్రాణం తీసిన భార్య
- వివాహేతర సంబంధం అనుమానంతో చెలరేగిన గొడవ
- దుపట్టాతో గొంతు నులిమి దారుణ హత్య
- హత్య తర్వాత గురద్వారాలో దాక్కున్న నిందితురాలు
- గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జగత్పురిలోని రషీద్ మార్కెట్లో నివసించే ముస్తకీమ్ అలియాస్ సాహిల్ (20), అలీషా (20) దంపతులు. 2వ తేదీ తెల్లవారుజామున 3:52 గంటల సమయంలో వారి ఇంట్లో గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి సాహిల్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతడిని హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితురాలు అలీషా నేరాన్ని అంగీకరించింది. తనకు వివాహేతర సంబంధం ఉందన్న భర్త అనుమానించేవాడని, ఆ రాత్రి తన మొబైల్ ఫోన్ లాక్కుని చెక్ చేయడంతో గొడవ మొదలైందని తెలిపింది. వాగ్వివాదం పెరిగి సాహిల్ తనపై దాడి చేయడంతో, ఆగ్రహంతో అతడిని దుపట్టాతో గొంతు బిగించి చంపినట్లు అంగీకరించింది.