భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదు: కందుల దుర్గేశ్
- హద్దులు దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్న దుర్గేశ్
- పవన్ పై పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్న మంత్రి
"సోషల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని హద్దులు దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు.. అది బూతులు తిట్టడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు" అని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లను దుర్వినియోగం చేస్తూ సమాజ వాతావరణాన్ని పాడుచేసే వారిపై చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు కావాలనే పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ను రాజకీయంగా బలహీనపరిస్తే, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయవచ్చనే కుట్రపూరిత వ్యూహంతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ వ్యవహరిస్తోందని విమర్శించారు. కేవలం తమ యూట్యూబ్ ఛానళ్లు, పేజీల వ్యూస్ పెంచుకోవడం కోసం డిప్యూటీ సీఎం పేరును వాడుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ హద్దులు దాటి వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు ఎవరికీ లేదని, అందుకే సోషల్ మీడియాపై తగిన నియంత్రణ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తు వినియోగంపైనా కందుల దుర్గేశ్ కీలక వివరాలు వెల్లడించారు. రుషికొండ భవనాలను పర్యాటకాభివృద్ధికి, అలాగే ప్రజల సందర్శన కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీని నిర్వహణను చేపట్టేందుకు ఇప్పటికే 'ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI)'ను ఆహ్వానించినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ తుగ్లక్ విధానాల కారణంగా రాష్ట్ర పర్యాటక శాఖకు ఏటా సుమారు రూ. 7 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని మంత్రి మండిపడ్డారు. ఇకపై ఆ నష్టాల నుంచి పర్యాటక రంగాన్ని గట్టెక్కించి, రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.