చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు: భూమన

Bhumana Karunakar Reddy says Chandrababu Naidu is neglecting farmers in his own district
  • మామిడి రైతులకు మద్దతుగా జీడీ నెల్లూరులో వైసీపీ నేతల ధర్నా
  • రైతులకు అండగా నిలవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న భూమన
  • కిలో మామిడికి కనీస మద్దతు ధర రూ. 17 ఇవ్వాలని డిమాండ్

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, పోలీసులు ఈ ధర్నాను అడ్డుకుని, వైసీపీ నాయకులను అక్కడి నుంచి తరలించారు. 


ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లాలోనే రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు అండగా నిలవడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మామిడి రైతులకు కిలో కనీస మద్దతు ధర రూ.17 ఇవ్వాలని డిమాండ్ చేశారు.


పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తోతాపురి మామిడిని కిలో రూ.17.50 చొప్పున దాదాపు లక్షా 30 వేల టన్నులు కొనుగోలు చేయడానికి అంగీకరించిందని భూమన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న శ్రద్ధ మన ముఖ్యమంత్రికి లేదని, చంద్రబాబు వెంటనే కేంద్రంతో మాట్లాడి ఇక్కడి రైతులకు కూడా అదే స్థాయిలో న్యాయం చేయాలని కోరారు. 


గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో తోతాపురి మామిడి ధర ఎప్పుడూ రూ.25 కంటే తగ్గలేదని, రైతులకు పూర్తి భరోసా ఉండేదని చెప్పారు. మామిడి రైతులకు న్యాయమైన ధర దక్కే వరకు తమ పార్టీ తరఫున పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Bhumana Karunakar Reddy
Chandrababu Naidu
Mango Farmers Protest
Chittoor District News
Totapuri Mango Price
YSRCP News

More Telugu News