జీతభత్యాల వివరాలు అందించండి.. కేంద్ర శాఖలకు 8వ పే కమిషన్ డెడ్‌లైన్

8th Pay Commission sets deadline for central departments to submit salary details
  • 8వ వేతన సంఘం ప్రక్రియలో కీలక ముందడుగు
  • ఉద్యోగుల జీతభత్యాల వ్యయ వివరాలను కోరిన కమిషన్
  • జూన్ 30 లోగా ఆన్‌లైన్‌లోనే డేటా సమర్పించాలని ఆదేశం
  • గత మూడేళ్ల ఆర్థిక సంవత్సరాల పూర్తి వివరాలు తప్పనిసరి
  • సిఫార్సుల రూపకల్పనలో ఈ సమాచారం అత్యంత కీలకం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 8వ వేతన సంఘం (8th Pay Commission) తన కార్యకలాపాలను కీలక దశకు చేర్చింది. ఉద్యోగుల జీతాలు, అలవెన్సులపై సిఫార్సులు చేసేందుకు ముందుగా.. ప్రభుత్వం ప్రస్తుతం ఎంత ఖర్చు చేస్తోందో స్పష్టమైన అంచనాకు రావాలని కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు తమ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆన్‌లైన్ డేటా పోర్టల్‌లో సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేయడానికి జూన్ 30 తుది గడువుగా నిర్ణయించినట్లు 8వ పే కమిషన్ అప్‌డేట్స్‌ను పంచుకునే ఒక పోర్టల్ పేర్కొంది. ఈ ప్రక్రియలో వందలాది ప్రభుత్వ కార్యాలయాలు, భారీ ఆర్థిక డేటా ఇమిడి ఉన్నందున, అన్ని సంస్థలు గడువులోగా ఈ పని పూర్తి చేస్తాయా? లేదా? కమిషన్ మరింత సమయం ఇస్తుందా అనేది వేచి చూడాలి.

ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి
సమాచారమంతా తప్పనిసరిగా తమ అధికారిక ఆన్‌లైన్ డేటా పోర్టల్ ద్వారానే సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ పద్ధతిలో ఎలాంటి వివరాలను స్వీకరించబోమని స్ప‌ష్టం చేసింది. అంటే.. మంత్రిత్వ శాఖలు భౌతిక ఫైళ్లు, ఎక్సెల్ షీట్లు, ప్రింటెడ్ డాక్యుమెంట్లు లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపడానికి వీల్లేదు. కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సిఫార్సుల రూపకల్పన కోసం ఒకే డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కోరిన వివరాలు ఇవే..
నివేదికల ప్రకారం.. గత మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వ్యయ వివరాలను అందించాలని కమిషన్ కోరింది. 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలలో ఉద్యోగుల జీతభత్యాలపై అయిన ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పే మ్యాట్రిక్స్ లెవల్ 1 నుంచి లెవల్ 18 వరకు అన్ని స్థాయిలలో జీతాలు, వివిధ రకాల అలవెన్సులపై ఎంత ఖర్చు చేశారో విడివిడిగా చూపించాలి.

కేవలం మూల వేతనం (Basic Pay) మాత్రమే కాకుండా ప్రతి అంశానికి సంబంధించిన పూర్తి వ్యయ వివరాలను కమిషన్ కోరింది. ఇందులో బేసిక్ పే, మిలిటరీ సర్వీస్ పే, కరవు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), రవాణా భత్యం (టీపీటీఏ), రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, రైల్వే ఉద్యోగులకు రన్నింగ్ స్టాఫ్ అలవెన్సులు, నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్ (ఎన్‌పీఏ) వంటి అన్ని వివరాలు ఉండాలి. వీటికి తోడు ఉద్యోగులకు చెల్లించే ఇతర అలవెన్సుల వివరాలను కూడా పొందుపరచాలి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో అలవెన్సులపై అయిన మొత్తం ఖర్చును కూడా నివేదించాల్సి ఉంటుంది.

ఈ కసరత్తు ఎందుకంటే..
వేతన సంఘం తన సిఫార్సుల రూపకల్పనకు ముందు చేపట్టే అతి ముఖ్యమైన చర్యలలో ఈ డేటా సేకరణ ఒకటి. ప్రస్తుతం వివిధ పే లెవల్స్‌లో జీతభత్యాలపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో అధ్యయనం చేయడం ద్వారా, భవిష్యత్తులో చేసే సవరణల వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక ప్రభావాన్ని కమిషన్ కచ్చితంగా అంచనా వేయగలదు. సవరించిన పే స్కేల్స్, అలవెన్సులు, ప్రభుత్వ మొత్తం వ్యయం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై పటిష్టమైన సిఫార్సులు చేయడానికి ఈ సమాచారం దోహదపడుతుంది. ఈ డేటా సేకరణ పూర్తయ్యాక, కమిషన్ గణాంకాలను విశ్లేషించి, నివేదిక రూపకల్పనలో తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది.
8th Pay Commission
Central Government Employees
Salary Revision Update
Pay Commission Deadline
Government Employee Allowances
Online Data Portal

More Telugu News