గాజాపై మోదీ సర్కార్ మౌనం.. సోనియా ఫైర్, బీజేపీ కౌంటర్
- గాజాపై మోదీ ప్రభుత్వం మౌనం వహించడంపై సోనియా గాంధీ విమర్శలు
- ఇది నైతికంగా తప్పు, దేశ ప్రయోజనాలకు విరుద్ధం అని వ్యాఖ్య
- సోనియా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్న బీజేపీ
- గాజా విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందన్న కమలం పార్టీ
- బంగ్లాదేశ్లో హిందువులపై దాడులప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్న
ఒక జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో సోనియా గాంధీ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇరాన్, పశ్చిమాసియా పరిణామాలపై భారత్ అనుసరిస్తున్న తీరుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల భారత్ తన సంప్రదాయ మిత్రదేశాలకు, అంతర్జాతీయ ప్రజాభిప్రాయానికి దూరమవుతోందని, ఇది పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు దారితీసే అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. రిటైర్డ్ జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని బృందం నివేదికను ప్రస్తావిస్తూ.. గాజాలో ఇప్పటివరకు 22,000 మందికి పైగా చిన్నారులు మరణించారని, దాదాపు 44,000 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆమె గుర్తుచేశారు.
సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా ఘాటుగా స్పందించారు. సోనియా గాంధీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాలస్తీనియన్ల హక్కుల గురించి ఆందోళన చెందుతున్న సోనియా, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. గాజా విషయంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని, అక్కడి బాధితులకు మానవతా సాయం కూడా అందించిందని పూనావాలా గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై సాగుతున్న రాజకీయ వాగ్వాదానికి ఈ విమర్శలు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.