కువైట్, బహ్రెయిన్లపై విరుచుకుపడిన ఇరాన్.. ట్రంప్ హెచ్చరికతో యుద్ధ మేఘాలు!
- అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
- కువైట్, బహ్రెయిన్ లక్ష్యంగా డ్రోన్ల ప్రయోగం
- ఇరాన్ ఉనికిని తుడిచేస్తామన్న డొనాల్డ్ ట్రంప్
- ప్రాంతీయ శాంతి ఒప్పందానికి తీవ్ర విఘాతం
హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న తమ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ గిడ్డంగులు, తీరప్రాంత రాడార్ స్థావరాలపై అమెరికా జరిపిన దాడులకు సమాధానంగానే తాము ఈ సైనిక చర్య చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకోగా, బహ్రెయిన్లోని అమెరికా సైనిక కేంద్రాల పరిసరాల్లో భారీ అలజడి రేగింది. ఈ దాడుల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
బహిరంగ హెచ్చరికలు
ఈ దాడి అనంతరం ఇరాన్ నావికాదళం అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు ‘నరకాన్ని చూస్తాయని’ వ్యాఖ్యానించింది. అమెరికాయే మొదట శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలను పాటించని నౌకలపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఇరాన్ గనుక ఇలాగే ఒప్పందాలను ఉల్లంఘిస్తూ పోతే వాషింగ్టన్ సైనిక పరంగా ఈ కథను ముగించాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి పరిస్థితి వస్తే ప్రపంచ పటంలో ‘ఇరాన్ అనే దేశమే ఇకపై ఉనికిలో ఉండదు’ అంటూ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ముదిరిన సంక్షోభం
హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ‘కికు’ అనే అంతర్జాతీయ చమురు నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతిచర్యగా అమెరికా సైన్యం దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమెరికా వరుసగా రెండో రోజు కూడా ఇరాన్ స్థావరాలను ధ్వంసం చేయడంతో ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.