ఇల్లు అప్పగించినా, నష్టపరిహారం చెల్లించాల్సిందే: సుప్రీం తీర్పు
- ఫ్లాట్ స్వాధీనం ఆలస్యమైతే పరిహారం కోరే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం
- ఇల్లు చేతికి వచ్చిన తర్వాత కూడా ఈ హక్కు కొనసాగుతుందని తీర్పు
- జాతీయ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
- ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారులకు భారీ ఊరట
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక కేసును పునర్విచారణకు స్వీకరించింది. "నిర్మాణ జాప్యానికి సంబంధించిన నష్టపరిహారం అనేది ఫ్లాట్ అప్పగించడానికి ముందు కాలానికి వర్తిస్తుంది. కేవలం ఫ్లాట్ను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన, ఆ జాప్యానికి పరిహారం కోరే హక్కును కొనుగోలుదారులు కోల్పోరు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఢిల్లీకి చెందిన టి.కె.ఎ. పద్మనాభన్ అనే వ్యక్తి, అభియాన్ కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీపై 2005లో దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. ఫ్లాట్ అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. అయితే, ఒప్పందంలోని ఆర్బిట్రేషన్ క్లాజ్ను ప్రాతిపదికగా తీసుకుని కింది కోర్టులు ఈ కేసును మధ్యవర్తిత్వానికి పంపాయి.
ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం-1986 అనేది ప్రైవేట్ ఆర్బిట్రేషన్ నిబంధనలకు అతీతంగా వినియోగదారులకు అదనపు రక్షణ కల్పిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును ఏడాదిలోగా పరిష్కరించాలని ద్వారక జిల్లా వినియోగదారుల ఫోరమ్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.