జీతం లక్ష.. చేతిలో సేవింగ్స్ సున్నా.. ఉద్యోగులను ముంచుతున్నవి ఈ అలవాట్లే!
- లక్ష జీతం సంపాదిస్తున్నా పొదుపు చేయలేకపోతున్న పట్టణ నిపుణులు
- ఆదాయంతో పాటు ఖర్చులు పెంచుకోవడమే ప్రధాన సమస్య
- నగరాల్లో భారీ అద్దెలు, ఈఎంఐలతో తరిగిపోతున్న జీతాలు
- జీతం రాగానే పొదుపు చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు
పొదుపు తగ్గడానికి ముఖ్య కారణాలు
లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్ ( జీవనశైలి ద్రవ్యోల్బణం)
జీతం పెరగ్గానే చాలామంది తమ జీవన ప్రమాణాలను (లైఫ్స్టైల్) మార్చేస్తున్నారు. పెద్ద ఇళ్లు, ఖరీదైన రెస్టారెంట్లలో భోజనాలు, ప్రీమియం గ్యాడ్జెట్లు, విలాసవంతమైన విహారయాత్రలు వంటివి అలవాటు చేసుకుంటున్నారు. మొదట్లో కష్టపడి పనిచేసినందుకు రివార్డుగా భావించే ఇటువంటి ఖర్చులు, క్రమంగా రోజువారీ అలవాట్లుగా మారిపోయి పొదుపును దెబ్బతీస్తున్నాయి.
భారీగా పెరిగిన పట్టణ జీవన వ్యయం
బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఫిక్స్డ్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్ నిశాంత్ శంకర్ వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం ఇంటి అద్దె కోసమే రూ. 20,000 నుండి రూ. 40,000 వరకు ఖర్చవుతోంది. దీనికి తోడు పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువులు, ఈఎంఐలు బడ్జెట్ను అతలాకుతలం చేస్తున్నాయి.
ఈజీ క్రెడిట్.. అప్పుల ఊబి
క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు సులభంగా లభిస్తుండటంతో తాము కొనుగోలు చేయలేని వస్తువులను కూడా ఈఎంఐలలో కొనేస్తున్నారు. అప్పు తీసుకునే సామర్థ్యాన్ని తమ సొంత ఆర్థిక బలంగా తప్పుగా ఊహించుకోవడం వల్ల, వడ్డీలు కట్టడానికే ఎక్కువ డబ్బు సరిపోతోంది.
పెట్టుబడులు పెట్టకపోవడం
చాలామంది పొదుపు లేదా పెట్టుబడులను 'తర్వాత చూద్దాం' అని వాయిదా వేస్తుంటారు. అలాగే లగ్జరీ కార్లు వంటి తరుగుదల ఉండే ఆస్తులను పెట్టుబడిగా భావిస్తున్నారు. వీటికి తోడు సోషల్ మీడియాలో ఇతరుల లైఫ్స్టైల్తో పోల్చుకుని చూసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, అనవసరమైన ఖర్చులకు దారితీస్తోంది. చాలా కుటుంబాలు కేవలం ఒకరి సంపాదన మీదే ఆధారపడటం కూడా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతోంది.
ఆర్థిక నిపుణుల సూచనలు
భారతదేశంలో గృహ ఆర్థిక పొదుపు రేటు జీడీపీలో బహుళ సంవత్సరాల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు ఒక కీలక సూత్రం చెబుతున్నారు. జీతం రాగానే ముందుగా ఖర్చులు పెట్టుకుని ఆ తర్వాత మిగిలింది దాచుకోవడం కాకుండా.. జీతం పడగానే '50-30-20' నిబంధన ప్రకారం అందులో ఒక స్థిరమైన భాగాన్ని (కనీసం 20 శాతం) ముందే పొదుపు లేదా ఇన్వెస్ట్మెంట్కు కేటాయించాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే నెలవారీ ఖర్చులు ప్లాన్ చేసుకోవడం, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మాత్రమే దీర్ఘకాలిక ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది.