దేశాన్ని విడదీయొద్దు.. రేవంత్ రెడ్డికి ‘ఇండీ’ మిత్రపక్షం హితవు!

Revanth Reddy advised by INDIA ally not to divide the country
  • ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారత్‌కు చెందినవారేనన్న రేవంత్‌ రెడ్డి
  • దక్షిణ భారత ప్రజలు రెండో శ్రేణి పౌరులుగా ఉండలేరని వ్యాఖ్య
  • రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన శివసేన(యూబీటీ)
  • యుద్ధం వస్తే భారతీయులుగానే పోరాడతామని ఉద్బోధ
  • ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని హితవు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన ‘ఉత్తర-దక్షిణ భారత’ వ్యాఖ్యలపై ‘ఇండీ’ కూటమి మిత్రపక్షం శివసేన (యూబీటీ) తీవ్రంగా స్పందించింది. దేశాన్ని రాష్ట్రాల వారీగా ముక్కలు చేసేలా మాట్లాడటం ఏమాత్రం సరికాదని హితవు పలికింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రాంతీయ విభేదాల కంటే జాతీయ ఐక్యతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

ఈ వివాదంపై శివసేన (యూబీటీ) అధికార ప్రతినిధి ఆనంద్ దూబే మాట్లాడుతూ.. ‘‘మన భారతదేశం ఓ అందమైన పూలగుచ్ఛం లాంటిది. అందులో ఒక్కో పువ్వు ఒక్కో రంగులో, ఒక్కో సువాసనతో ఉంటుంది. కానీ అవన్నీ కలిస్తేనే ఒక అందమైన గుచ్ఛం అవుతుంది’’ అని దూబే వ్యాఖ్యానించారు. భౌగోళిక, భాషా వ్యత్యాసాలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి సమాన గౌరవం దక్కాలని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌తో యుద్ధం వస్తే మనం ఉత్తర భారతం, దక్షిణ భారతం అని చూసుకోమని దూబే వ్యాఖ్యానించారు. మనమందరం భారతీయులుగానే నిలబడతామని, రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేత అయినప్పటికీ కూటమి భాగస్వామ్య పక్షంగా దేశ సమగ్రత విషయంలో తాము రాజీపడేది లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాబోవని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి ఇద్దరూ ఉత్తర భారత్‌కు చెందినవారేనని.. దక్షిణాదిని ప్రాతినిధ్యం వహించే బలం బీజేపీకి లేదని ఆరోపించారు. దక్షిణ భారతదేశ ప్రజలు ఈ దేశంలో ‘రెండో శ్రేణి పౌరులుగా’ బతకడానికి ఇష్టపడరని అనడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Revanth Reddy
Shiv Sena UBT
INDIA Alliance
North South India divide
Telangana CM
Anand Dubey

More Telugu News