రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్‌ కుర్రాడు.. ఎందుకో తెలుసా?

Hyderabad Youth Madhan Mohan Turns Down Higher Salary for Peace
  • రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న యువకుడు
  • జీతం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
  • కుటుంబ సాన్నిహిత్యంపై మొగ్గు
  • యువకుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్న నెటిజన్లు 
ఉద్యోగంలో జీతం ముఖ్యామా? లేక ప్రశాంతత ముఖ్యామా? అంటే చాలామంది ఎక్కువ జీతానికే ఓటేస్తారు. కానీ హైదరాబాద్‌కు చెందిన మదన్ మోహన్ అనే యువకుడు మాత్రం ఎక్కువ జీతాన్ని కాదని ప్రశాంతతకే ప్రాధాన్యం ఇచ్చాడు. బెంగళూరులో వచ్చిన రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకుని హైదరాబాద్‌లోనే రూ.30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగంలో చేరాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ అతను ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘నా చేతిలో రెండు ఆఫర్లు ఉన్నాయి. మొదటిది బెంగళూరులో రూ.38 లక్షల ప్యాకేజీ, రెండోది హైదరాబాద్‌లో రూ.30 లక్షల ప్యాకేజీ. నా నిర్ణయం చూసి చాలామంది ప్రశ్నించారు. కానీ, కొన్నిసార్లు అత్యధిక ప్యాకేజీనే ఉత్తమ నిర్ణయం కాకపోవచ్చు" అని మదన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తనకు హైదరాబాద్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉందని, ఈ నగరం ఇల్లులాంటి ఫీలింగ్‌ను ఇస్తుందని చెప్పాడు. ఇక్కడి మంచి ఆహారం, తక్కువ జీవన వ్యయం, తక్కువ ఒత్తిడి, కుటుంబం మరియు స్నేహితులు దగ్గరగా ఉండటం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.

చాలామంది కేవలం సీటీసీని మాత్రమే లెక్కిస్తారని, కానీ జీవిత నాణ్యతను, మానసిక ప్రశాంతతను లెక్కించరని మదన్ అన్నాడు. కాగితం మీద భారీ జీతం ఆకర్షణీయంగా కనిపించినా.. మనశ్శాంతి, సంతోషం అంతకంటే విలువైనవని స్పష్టం చేశాడు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 1.43 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.‘‘హైదరాబాద్ అన్నింటికంటే బెస్ట్’’, ‘‘క్వాలిటీ లైఫ్‌ చాలా ముఖ్యం’’ అంటూ మదన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

అయితే కొందరు మాత్రం ఆర్థికంగా ఎదగడానికి బెంగళూరు ఆఫర్ ఒప్పుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Madhan Mohan
Hyderabad
Bengaluru
Job Package
Salary
Work Life Balance
Cost of Living
Mental Peace
Career Choice
Job Offer

More Telugu News