తమిళనాడులో మిత్రుడికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ

Narendra Modi Slams Congress for Betraying DMK in Tamil Nadu
  • దశాబ్దాల పాటు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను వదిలేసిందని వ్యాఖ్య
  • డీఎంకేతో పొత్తు వల్ల కాంగ్రెస్ ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని వ్యాఖ్య
  • రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయానికైనా దిగజారుతుందని ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాల పాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అధికారం కోసం ఎంతోకాలంగా కలిసి ఉన్న మిత్రుడిని వదిలేసిందని అన్నారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని పేర్కొన్నారు. 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం డీఎంకే వల్లే మనుగడ సాగించిందని అన్నారు. అలాంటి పార్టీని కష్ట సమయంలో వదిలేసిందని ఆరోపించారు. అధికారంపై ఉన్న దురాశతో స్టాలిన్‌ను వదిలి, టీవీకేతో చేతులు కలిపిందని దుయ్యబట్టారు. అధికారం కోసం దొరికిన తొలి అవకాశంలోనే మిత్రుడిని మోసం చేసిందని విమర్శించారు.

రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఎంతటి నీచరాజకీయానికైనా దిగజారుతుందని వ్యాఖ్యానించారు. అందుకే 40 ఏళ్ల క్రితం 400కు పైగా సీట్లున్న కాంగ్రెస్ ఇప్పుడు 100 సీట్లను కూడా సాధించలేకపోతోందని అన్నారు. ఓటమిని కూడా ఒప్పుకోలేనంత అహంకారం కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు ఉందని విమర్శించారు. ప్రతి దానికి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను నిందించడం అలవాటుగా మారిందని విమర్శించారు.

కర్ణాటకలో అంతర్గత విబేధాల కారణంగా సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని అన్నారు. గత మూడేళ్లలో ఇక్కడి ప్రభుత్వానికి అంతర్గత కలహాలను పరిష్కరించుకోవడంతోనే సరిపోయిందని అన్నారు. ప్రస్తుత సీఎం ఎంతకాలం కొనసాగుతారు లేదా మరో నాయకుడికి అవకాశం వస్తుందా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉందని అన్నారు. సరైన అజెండా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు.

దేశ ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ తగ్గిపోతోందని అన్నారు. సురక్షిత పాలన, అభివృద్ధి కోసం దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అందుకే ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Tamil Nadu
Congress Party
DMK
TVK
Karnataka Politics
Indian Politics
BJP
Stalin
Alliance Politics

More Telugu News