ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తున్నప్పుడు, బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారు?: వీహెచ్
- బీసీ కులగణన కోసం నిరాహారదీక్షకు కూర్చున్న వీహెచ్
- జనగణలో బీసీల కోసం ఒక కాలమ్ చేర్చాలని డిమాండ్
- మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించకపోవడాన్ని తప్పుబట్టిన వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు బీసీ కులగణన డిమాండ్తో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి తెలంగాణ పర్యటనను లక్ష్యంగా చేసుకుని వీహెచ్ ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కోసం ప్రత్యేకంగా ఒక కాలమ్ను చేర్చాలని, వారి జనాభా ప్రాతిపదికన న్యాయం చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తున్నప్పుడు, బీసీలను ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. బీసీలకు కూడా ఉద్యోగ, విద్యా రంగాల్లో సరైన వాటా దక్కాలని స్పష్టం చేశారు. బీసీల కులగణనపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్-కోటా కేటాయించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పర్యటించి బీజేపీ తీరును ఎండగడతానని ఆయన హెచ్చరించారు.