మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Konda Surekha Criticizes BJP Ahead of Modis Telangana Visit
  • ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ
  • రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు మాట్లాడటం లేదని విమర్శ
  • గోదావరి పుష్కరాల కోసం రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపాటు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోదీ హైదరాబాద్ సభ కోసం బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కేవలం మీటింగ్‌లు పెట్టడం, 'జై శ్రీరామ్' అనడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలా అనడం వల్ల పైనుంచి నిధులు పడుతున్నాయా లేదా పథకాలు వస్తున్నాయా అని ఆమె ప్రశ్నించారు. ప్రధానిని పిలిపించి హిందీలో నాలుగు మాటలు చెప్పించి పంపడం తప్ప, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇక్కడి కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ మాట్లాడటం లేదని ఆమె ధ్వజమెత్తారు. 


ముఖ్యంగా గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు కోట్లాది రూపాయలు విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు రూ. 4,200 కోట్లు కేటాయించారని చెప్పారు. తెలంగాణపై బీజేపీకి ఏ మాత్రం ప్రేమ లేదని మండిపడ్డారు. 


అదేవిధంగా, బీఆర్ఎస్ పార్టీపై కూడా మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కళ్లు ఉండి చూడలేని, చెవులు ఉండి వినలేని పార్టీ అని మండిపడ్డారు. గత పదేళ్లలో రైతులను పట్టించుకోని వారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని విమర్శించారు.
Go Back to Shorts
Konda Surekha
Narendra Modi
Telangana
BJP
BRS
Revanth Reddy
Godavari Pushkaralu
Telangana Funds
Political Criticism
Telangana Politics

More Telugu News