ఈ నెల 9 నుంచి వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష... మోదీకి అల్టిమేటం!
- బీసీ కులగణన కోసం వీహెచ్ నిరాహారదీక్ష
- 8వ తేదీ లోపు మోదీ స్పష్టతనివ్వాలని డిమాండ్
- బీసీనని చెప్పుకునే మోదీ బీసీలపై వివక్ష చూపుతున్నారని మండిపాటు
బీసీ కుల గణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో, వీహెచ్ కీలక అల్టిమేటం జారీ చేశారు. 8వ తేదీ లోపు కుల గణనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రధాని రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓసీ అయినప్పటికీ తెలంగాణలో బీసీ కుల గణన కోసం చొరవ తీసుకున్నారని, కానీ తాను బీసీని అని చెప్పుకునే మోదీ మాత్రం బీసీలపై వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.