తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం

  • శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన
  • ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్
  • రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి
తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌ లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి ఓ రోగిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి అంబులెన్స్‌ లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన అంబులెన్స్, అప్పటికే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు.
Go Back to Shorts

More Telugu News