చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Two held for sabotaging 240 CCTV cameras at Chinnaswamy during RCB vs GT match
  • ఆర్‌సీబీ-జీటీ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం
  • 240కి పైగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
  • సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగుల పనేనని నిర్ధారణ
  • రూ.10 లక్షల బకాయిలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ చర్య
  • క్యూబన్ పార్క్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఈ నెల‌ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు స్టేడియంలోని నిఘా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 240 సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి.

పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం చిత్రదుర్గ జిల్లా హిరియూర్‌కు చెందిన మంజునాథ్ (37), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ కలాం (19) ఈ విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరు స్టేడియం డిజిటల్ సర్వైలెన్స్ బాధ్యతలు చూస్తున్న ఐవీఎస్ డిజిటల్ సొల్యూషన్స్ అనే సంస్థ కింద సబ్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. డీయాక్టివేట్ చేసిన యాక్సెస్ కార్డును ఉపయోగించి, నిందితులు ఉదయం 11:30 గంటలకు స్టేడియంలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్, సర్వర్ రూమ్ వంటి నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించారు. అక్కడ నెట్‌వర్క్ వీడియో రికార్డర్లు (NVRs), ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లను ధ్వంసం చేశారు. దీంతో ఎంట్రీ గేట్లు, కాన్కోర్సులు, డీ కార్పొరేట్ స్టాండ్ వంటి కీలక ప్రాంతాల్లోని కెమెరాలు పనిచేయడం మానేశాయి.

సుమారు రూ.10 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆగ్రహంతో ఈ విధ్వంసానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అయితే, ఈ వాదనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పర్యవేక్షణ, యాక్సెస్ కంట్రోల్ విధానాల్లోని లోపాలను కూడా పరిశీలిస్తున్నారు.

స్టేడియం నిఘా వ్యవస్థలతో సంబంధమున్న స్టాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి ఆదిత్య భట్ ఫిర్యాదు మేరకు క్యూబన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు సున్నితమైన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై, ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయడంతో మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ముగిసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారం ఆర్‌సీబీ ఇప్పటికే బెంగళూరులో తన హోం మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. మిగిలిన మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.
Go Back to Shorts
RCB vs GT
CCTV Cameras
Chinnaswamy Stadium
Bengaluru
IPL 2026

More Telugu News