చంద్రబాబువి నీచ రాజకీయాలు.. దమ్ముంటే జగన్పై నేరుగా యుద్ధం చేయాలి: సతీశ్ రెడ్డి
- చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు అల్లుతున్నాయన్న సతీశ్
- జగన్ కు సంబంధం లేని లింకులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు
- పెద్ద దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానంద రెడ్డికి ఏముందని ప్రశ్న
చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు అల్లుతున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు లేనిపోని లింకులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు ఇలాంటి 'పొలిటికల్ గేమ్స్' ఆడుతున్నారని విమర్శించారు. మాచర్లలో టీడీపీ నేతలు తమలో తాము చంపుకుంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు ఏ1గా చంద్రబాబుపైనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పెద్ద దస్తగిరిని హత్య చేయాల్సిన అవసరం నిత్యానంద రెడ్డికి ఏముందని ప్రశ్నించారు. దేవుడు అన్నిటికీ లెక్కలు రాస్తున్నాడని వ్యాఖ్యానించారు. పెద్ద దస్తగిరి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా ఈనాడులో కథనాలు రాస్తున్నారని విమర్శించారు. నీచ రాజకీయాలు మానుకుని, దమ్ముంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో నేరుగా యుద్ధం చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.