తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్
- తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ తేజస్విపై కవిత ఫైర్
- పవిత్రమైన ఉద్యమాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
- కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా తేజస్వి సూర్యపై విరుచుకుపడ్డారు.
నిండు పార్లమెంట్లో తెలంగాణ అస్తిత్వాన్ని, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ ఏర్పాటును ఒక విద్వేషపూరిత విభజనతో పోలుస్తావు? అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన తేజస్వి సూర్య తన ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే ఒక పోరాటమని, కోట్లాది మంది కలల సాకారమని... అటువంటి పవిత్రమైన ఉద్యమాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి బీజేపీ అగ్రనేతలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని కవిత ప్రశ్నించారు. సొంత రాష్ట్రాన్ని అవమానిస్తుంటే అడ్డుకోని వారు పదవుల్లో ఉండటానికి అనర్హులని, తెలంగాణ ప్రజలకు వారు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.