జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరి ఏమైనా ఉగ్రవాదా?: సజ్జల
- పూడి శ్రీహరి అరెస్టును ఖండించిన సజ్జల
- సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు
- సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని విమర్శ
వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు అండ్ కో చెప్పినట్లుగా నడుచుకుంటోందని విమర్శించారు.
పూడి శ్రీహరి అరెస్ట్ తీరుపై సజ్జల పలు ప్రశ్నలు సంధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా నిర్బంధించడం ఏంటని పోలీసులను నిలదీశారు. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరి ఏమైనా ఉగ్రవాదా? అని ప్రశ్నించిన ఆయన, కనీసం ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇవ్వకుండా పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టుపై డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అక్రమ కేసులకు, అరెస్టులకు వైసీపీ భయపడదని సజ్జల స్పష్టం చేశారు. ఈ విషయంలో చట్టపరంగా పోరాటం చేస్తామని చెబుతూనే, నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై భవిష్యత్తులో కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. "అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు" అంటూ పోలీసులను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.