ఈ విషయంలో మనమంతా ఏకమవుదాం: చంద్రబాబు సహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy Letter to Southern CMs on Lok Sabha Delimitation
  • లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎంలకు లేఖలు రాసిన రేవంత్ రెడ్డి
  • జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన
  • ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖ
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లకు ఆయన లేఖలు రాశారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

లోక్‌సభ సీట్ల సర్దుబాటును దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కులపై జరుగుతున్న దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. "దక్షిణాదిపై జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కోవడానికి మనమంతా ఏకం కావాలి. ఢిల్లీలో మన గొంతుకను కాపాడుకోవాలి" అని తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు బహుమతికి బదులుగా శిక్షపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గి, రాజకీయంగా ప్రాబల్యం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ ప్రమాదాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందరికంటే ముందుగానే గుర్తించారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. గత సంవత్సరం మార్చిలోనే చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల నేతలతో సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్ఫూర్తితో అందరూ కలిసి ముందుకు సాగాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సిద్ధాంతాలను గుర్తుచేస్తూ "చైతన్యవంతులను చేయండి, ఆందోళన చేయండి, సంఘటితం కండి" అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

"దక్షిణ భారతదేశానికి అత్యంత కీలకమైన ఈ విషయంలో మనమంతా ఏకం కావాలని ఈ లేఖ రాస్తున్నాను. రాజకీయ హక్కులపై జరుగుతున్న ఈ దాడిని మనం ఎదిరించి, ఢిల్లీలో మన గొంతుకను కాపాడుకోవాలి" అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ తీవ్రమైన సమస్యపై అందరూ కలిసి ముందుకు సాగాలని, ఐక్యంగా కవాతు చేద్దామని రేవంత్ తన లేఖను ముగించారు.
Go Back to Shorts
Revanth Reddy
Lok Sabha
delimitation
South India
Chandrababu Naidu
MK Stalin
Pinarayi Vijayan

More Telugu News