రోడ్ల నిర్మాణంతోనే జాతి నిర్మాణం, ఆర్థిక ప్రగతి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Roads for AP Economic Growth
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కేవలం ప్రయాణ సౌకర్యాల కోసమే కాకుండా, విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా పటిష్ఠమైన కనెక్టివిటీ వ్యవస్థను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో బుధవారం రహదారులు-భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, గుంతలు లేని రోడ్లు, ఈవీ బస్సుల వినియోగం, పోర్టు కారిడార్ల అభివృద్ధి వంటి కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

వివిధ నగరాలకు ఔటర్ కారిడార్లు 

రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఔటర్ కారిడార్ మోడల్స్‌ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. నగరాలకు రింగ్ రోడ్లు నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం అవుతాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను ఏపీతో అనుసంధానించేలా రహదారుల నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. 

రహదారుల పటిష్ఠ నిర్వహణపై సీఎం దృష్టి 

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ అత్యంత పటిష్టంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,433 కిలోమీటర్ల రోడ్లలో, ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోడ్లపై గుంతలు పడిన వెంటనే మరమ్మతులు చేపడితే సమస్యలు ఉండవని, ఇది నిరంతర ప్రక్రియగా సాగాలని సూచించారు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని ఆదేశించారు. 

ఆర్ అండ్ బీ రహదారుల నిర్వహణకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నల్లరేగడి నేలలున్న ప్రాంతాల్లో హైబ్రీడ్ మోడల్‌లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్లు నిర్మించాలని, కాలువ గట్ల వెంబడి తరచూ దెబ్బతింటున్న 570 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కొత్త సాంకేతికతపై యూనివర్సిటీలతో అధ్యయనం చేయించాలని సూచించారు.

గోదావరి పుష్కరాలకు ప్రత్యేక కార్యాచరణ 

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 471 గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రహదారుల అభివృద్ధి పనులు రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. 

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుష్కరాల కోసం రూ.400 కోట్ల ‘సాస్కీ’ నిధులతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు.

పోర్టుల అనుసంధానమే లక్ష్యం 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పోర్టులు గుండెకాయ వంటివని, వాటిని కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలని చంద్రబాబు అన్నారు. పశ్చిమ భారతంలో గుజరాత్ మోడల్ తరహాలో, తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్‌ను పోర్టుల హబ్‌గా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈస్ట్-వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో లాజిస్టిక్స్ వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను అనుసంధానిస్తూ, పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వరకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా నిర్మించాలని చెప్పారు. దీనికి అవసరమైన ఆర్థిక వనరులను ‘ఏపీ లింక్’ ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు.

ఆర్థిక ప్రగతికి జాతీయ రహదారుల కీలకం 

"జాతీయ రహదారుల నిర్మాణంతోనే జాతి నిర్మాణం జరుగుతుంది" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రహదారుల నిర్మాణం ద్వారా సమీప ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలన్నారు. పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తులకు కేంద్రంగా మారుతున్న ఏపీ నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరుకు రవాణా సులభతరం కావాలని చెప్పారు. 

ఖరగ్ పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-శ్రీశైలం-డోర్నాల, కల్వకుర్తి-నంద్యాల వంటి జాతీయ రహదారులతో కనెక్టివిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. రాబోయే రెండేళ్లలో 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు అందుబాటులోకి వస్తాయని, ఈ ఏడాదిలోనే రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించారు.

తక్కువ వ్యయంతో ఈవీ బస్సులు

ప్రజా రవాణాను అతి తక్కువ వ్యయంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, దీనికి ఎలక్ట్రిక్ బస్సుల వినియోగమే సరైన మార్గమని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం కిలోమీటరుకు రూ.72గా ఉన్న ఈవీ బస్సు నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు వివిధ మోడళ్లను అధ్యయనం చేయాలని సూచించారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. అన్ని కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులనే నడపాలని, ప్రజల్లో ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించి దానిని ఒక మాస్ ట్రాన్స్‌పోర్ట్‌గా మార్చాలని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh roads
AP ports connectivity
National highways AP
Godavari Pushkaralu
AP economic development
EV buses Andhra Pradesh
Outer ring roads AP
Road maintenance AP
AP logistics

More Telugu News