ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?: 'ఆంధ్రజ్యోతి'పై వైసీపీ దాడి పట్ల అనగాని, సోమిరెడ్డి ఆగ్రహం
హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి యత్నాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజధానిపై జగన్ నిర్ణయాలను ఎత్తిచూపినందుకు ఇలా దాడులకు దిగడం అప్రజాస్వామికమని వారు మండిపడ్డారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ... దాడులు, దౌర్జన్యాలు, అబద్ధాలు ఆడటం వైసీపీ నేతల డీఎన్ఏలోనే ఉందని అన్నారు. ప్రశ్నించే మీడియా గొంతు నొక్కడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 'మావిగన్' ప్రతిపాదనతో నవ్వులపాలైన వైసీపీ... ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తోందని విమర్శించారు. గత అరాచకాలకు ప్రతిఫలంగా ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా, జగన్ ఇంకా బుద్ధి రాకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ స్పందిస్తూ... రాజధాని విషయంలో జగన్ ఏం చెబితే దానికి వైసీపీ నేతలు 'ఎస్' అంటున్నారని ఏబీఎన్ రాధాకృష్ణ అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. "మొదట అమరావతికి జై కొట్టారు, తర్వాత మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు.. ఈ మార్పులను ఎత్తిచూపితే ఉలుకెందుకు?" అని నిలదీశారు. కథనంపై అభ్యంతరం ఉంటే ఖండన ఇచ్చుకోవాలి తప్ప, కార్యాలయాల మీదకు రౌడీ మూకలను పంపడం సరికాదని, వైసీపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.