TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!

TTD facing problem with old demonetized notes in Tirumala Srivari Hundi
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తలనొప్పిగా మారింది. శ్రీవారి హుండీలో పేరుకుపోయిన రూ.500, రూ.1000 పాత నోట్ల విలువ దాదాపు రూ.400 కోట్లకు చేరినట్లు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు నిరుపయోగంగా మారడంతో టీటీడీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ, భక్తులు తమ మొక్కుల్లో భాగంగా ఇప్పటికీ ఈ పాత నోట్లను హుండీలో వేస్తూనే ఉన్నారు. భక్తిభావంతో సమర్పించిన ఈ కానుకలను తిరస్కరించలేని పరిస్థితిలో టీటీడీ ఉంది. హుండీ లెక్కింపు (పరకామణి) సమయంలో సిబ్బంది ఈ పాత నోట్లను వేరు చేసి నిల్వ చేస్తున్నారు. ఏళ్లు గడిచేకొద్దీ ఈ మొత్తం భారీగా పేరుకుపోతోంది.

ఈ రద్దు నోట్లను మార్చుకునేందుకు ఒక అవకాశం కల్పించాలని టీటీడీ యాజమాన్యం చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరుతూ వస్తోంది. పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రితో, ఆర్బీఐ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. టీటీడీకి ప్రత్యేకంగా అనుమతి ఇస్తే, ఇతర సంస్థల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లు వస్తాయనే కారణంతో కేంద్రం ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. దీంతో భక్తులు సమర్పించిన రూ.400 కోట్ల నిధులను ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

మరోవైపు రద్దు చేసిన రూ.2 వేల నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. దీనిపై పరకామణి ఇన్ చార్జి డిప్యూటి ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెలా రూ.35 లక్షల వరకు రూ.2 వేల నోట్లు హుండీలో భక్తులు సమర్పిస్తున్నారని, ఈ నోట్లను ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నై లోని ఆర్బీఐ రీజినల్ కేంద్రంలో మార్పిడి చేసుకుంటున్నట్లు తెలిపారు.
 
Go Back to Shorts
TTD
Tirumala
Tirupati
Srivari Hundi
Demonetized notes
RBI
Old currency
Rupee 500 note
Rupee 1000 note
Rupee 2000 note

More Telugu News