Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Thanks Modi Vaishnaw Chandrababu for Pithapuram Railway Funds
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' పరిధిలోకి పిఠాపురం స్టేషన్‌ను చేర్చుతూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్ అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కోసం రూ. 37.25 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో పిఠాపురం స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

కొద్ది నెలల క్రితం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి ఆవశ్యకతను ఆయనకు సమగ్రంగా వివరించారు. పురాణ ప్రాధాన్యం ఉన్న పిఠాపురం పట్టణానికి దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ నొక్కిచెప్పారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే యాత్రికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

నిజానికి, పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో పిఠాపురంలో పర్యటించినప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో స్టేషన్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, దుర్గంధం వెదజల్లడం గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఆనాడే స్టేషన్ రూపురేఖలు మార్చాలని ఆయన నిశ్చయించుకున్నారు.

పవన్ కల్యాణ్ అభ్యర్థన పట్ల కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడంతో, ఇక పిఠాపురం స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. ఈ నిధులతో స్టేషన్ ప్రధాన భవనం, ముఖద్వారం నిర్మాణం, ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి, కొత్త షెల్టర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గది, అత్యాధునిక టాయిలెట్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్ పనులను కూడా పూర్తి చేయనున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తాను అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, తక్షణం స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కూడా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.


Go Back to Shorts
Pawan Kalyan
Pithapuram
Ashwini Vaishnaw
Narendra Modi
Chandrababu Naidu
Amrit Bharat Station Scheme
Indian Railways
Andhra Pradesh
Pithapuram Railway Station
Railway Development

More Telugu News