Chandrababu Naidu: 2 వేల మందితో మొదలై.. 2.80 లక్షల మందికి..! శ్రీవారి అన్నదానంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు

AP CM Chandrababu on 39 Years of Sri Venkateswara Annadanam
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన పథకం మరో మైలురాయిని అధిగమించింది. 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ మహోన్నత కార్యక్రమం నేటితో 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మంది భక్తులతో మొదలైన ఈ సేవ, నేడు రోజుకు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం అందించే స్థాయికి చేరడం విశేషం.

ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల భాగస్వామ్యం, దాతల సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి రూ.2,500 కోట్లు దాటిందని తెలిపారు. ఈ పథకం స్ఫూర్తితోనే ప్రాణదానం, విద్యాదానం వంటి ట్రస్టులను ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా రంగాల్లో సేవలు అందిస్తున్నామని వివరించారు.

ప్రస్తుతం టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు జరిగిన ప్రగతిని వివరిస్తూ చంద్రబాబు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ మహోన్నత కార్యక్రమానికి చేయూతనిస్తున్న దాతలకు ఆయన అభినందనలు, నమస్కారాలు తెలియజేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Tirumala
Sri Venkateswara
Annadanam
TTD
NTR
Andhra Pradesh
Temple
Charity
Food Donation

More Telugu News